Begin typing your search above and press return to search.

నష్టాలు వచ్చేశాయ్.. ఇక అమ్మిపడేయడమే మిగిలింది

By:  Tupaki Desk   |   22 March 2023 9:42 AM GMT
నష్టాలు వచ్చేశాయ్.. ఇక అమ్మిపడేయడమే మిగిలింది
X
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మహోద్వేగంతో సాగిన ఉద్యమ ఫలానికి నిలువెత్తు రూపం విశాఖ ఉక్కు కర్మాగం (రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్). ఈ కర్మాగారాన్ని అమ్మేయాలని కేంద్రంలోని మోడీ సర్కారు డిసైడ్ కావటం.. దీనిపై విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే.

మోడీ సర్కారు నిర్ణయాన్ని తప్పు పడుతూ.. ఆందోళనలు.. నిరసనలు వెల్లువెత్తినా.. మోడీ సర్కారు మాత్రం తన స్టాండ్ ను మార్చుకున్నది లేదు. ఇలాంటి వేళ.. విశాఖ ఉక్కుకు సంబంధించిన ఒక వాదన బలంగా వినిపించేది.

అదేమంటే.. విశాఖ ఉక్కు పరిశ్రమ లాభాల్లో నడుస్తోందని.. అలాంటి సంస్థను ఎలా అమ్ముతారన్న ప్రశ్న పలువురి నోట వినిపించేది. ఈ ప్రశ్నకు కేంద్రం సైతం సూటిగా సమాధానం ఇచ్చింది లేదు.బీజేపీ నేతలు సైతం ఈ ప్రశ్నను సంధించినంతనే మౌనాన్ని ఆశ్రయించడం..నీళ్లు నమలం చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా వెలువడిన నివేదికను చూసిన తర్వాత.. విశాఖ ఉక్కు విషయంలో ఏపీ ప్రజలు స్టాండ్ మార్చుకోవటం ఖాయం.తాజాగా విడుదలైన పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ప్రకారం విశాఖ ఉక్కుకు గత డిసెంబరు నాటికి నికరంగా రూ.2927 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లుగా నివేదిక వెల్లడించింది.

2023-24 బడ్జెట్ లో ఉక్కు శాఖకు కేటాయించిన బడ్జెట్.. ఆ శాఖకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల పని తీరుపై అధ్యయనం చేసిన స్థాయి సంఘం నివేదికను సిద్ధం చేసింది. అందులో విశాఖ ఉక్కు నికర నష్టాలు భారీగా ఉండటం చూసినప్పుడు.. ఇంతకాలం లాభాల్లో ఉన్న సంస్థను ఎందుకు తెగనమ్మాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్న ఉండేది.

ఇకపై..అలాంటి ప్రశ్న వేసే అవకాశం లేదు. నష్టాల్ని తగ్గించుకోవటానికి పూర్తి స్థాయి సామర్థ్యంతో పరిశ్రమను వినియోగించుకోవటంతో పాటు.. నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది.ఇదంతా చూసినప్పుడు..లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కును నష్టాల్లోకి వచ్చేసిన నేపథ్యంలో.. ఇక తెగనమ్మటమే మిగిలిందన్న విమర్శ వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.