Begin typing your search above and press return to search.

విజ‌య‌వాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలి!

By:  Tupaki Desk   |   26 Jan 2022 2:30 PM GMT
విజ‌య‌వాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలి!
X
ఏపీ ప్ర‌భుత్వానికి కొత్త జిల్లాల ఏర్ప‌డులో తొలి రోజే.. ఒకింత వ్య‌తిరేక‌త వ‌చ్చింది. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల‌ను విభ‌జిస్తూ.. మ‌రో 13 జిల్లాలుగా మారుస్తూ.. మొత్తం 26 జిల్లాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వీటిలో కొత్త‌గా ఏర్ప‌డే 13 జిల్లాల‌కు నాయ‌కుల పేర్లు.. ఆధ్యాత్మిక వ‌ర్గాల‌కు చెందిన వారి పేర్ల‌ను పెడుతున్న‌ట్టు పేర్కొంది. అయితే..వీటిపై అభ్యంత‌రాల‌ను 30 రోజుల్లోగా క‌లెక్ట‌ర్ల‌కు నివేదించాల‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో తొలి అభ్యంత‌రం అప్పుడే న‌మోదైంది.

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఏర్పడే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నగరానికి చెందిన కాపు నాయ‌కుడు, పేద‌ల పెన్నిధిగా గుర్తింపు పొందిన‌న వంగవీటి రంగా కుటుంబం నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ పేరుకు బదులుగా అందరికీ ఆమోదయోగ్యుడైన దివంగత నేత `వంగవీటి రంగా` పేరు పెట్టాలని ఆయన కుటుంబ సభ్యుడు, రాధా-రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ నేత వంగవీటి నరేంద్ డిమాండ్ చేశారు.

కొత్తగా ప్రతిపాదించిన జిల్లాలలో క్రష్ణాజిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వంగవీటి నరేంద్ర ప్రకటించారు. క్రష్ణాజిల్లాకు, ప్రజలకోసం ప్రాణ త్యాగాన్ని చేసినటువంటి గొప్ప మహనీయుడు, ప్రజానేత స్వర్గీయ‌ వంగవీటి మోహనరంగా పేరును పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో విజయవాడతో కూడిన కొత్త జిల్లాకు రంగా పేరు పెట్టాలని గతంలోనే తాము ప్రభుత్వాన్ని కూడా కోరినట్లు నరేంద్ర తెలిపారు.

అయినా ప్రభుత్వం దీన్ని పక్కనబెట్టి ఎన్టీఆర్ పేరు ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం కావాలనుకుంటే కృష్ణాజిల్లాలో నుంచి ఏర్పడుతున్న మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని ఆయన సూచించారు. మ‌రి దీనిపై ఎలాగూ అభ్యంత‌రాల‌ను స్వీక‌రిస్తామ‌ని చెప్పిన స‌ర్కారు.. ఈ అభ్యంత‌రాన్ని ఎలా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుందో చూడాలి. ప్ర‌స్తుతం రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధా.. టీడీపీలో ఉన్నారు. సో.. దీనిని బ‌ట్టి వైసీపీ స‌ర్కారు ఎలా స్పందిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.