Begin typing your search above and press return to search.

విజిలెన్స్‌ దాడులు..ఏపీలోని ఆ 6 ఆస్పత్రులపై కేసులు !

By:  Tupaki Desk   |   7 May 2021 9:30 AM GMT
విజిలెన్స్‌ దాడులు..ఏపీలోని ఆ 6 ఆస్పత్రులపై కేసులు !
X
ఏపీలో ఓ వైపు కరోనా మహమ్మారి తో ప్రజలు ఆందోళన చెందుతుంటే , ఇదే అదునుగా భావించి కొన్ని ఆస్పత్రులు కరోనా ను క్యాష్ చేసుకుంటున్నాయి. కరోనా భాధితులని నిలువునా దోచుకుంటున్న ఆసుపత్రులపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్, ఔషధ నియంత్రణ, వైద్యారోగ్యశాఖాధికారులతో కూడిన బృందం ఆరు ఆసుపత్రుల్లో అక్రమాలను గుర్తించింది. అనుమతి లేకున్నా కరోనాకు చికిత్స చేయడం, ఆరోగ్య శ్రీ కింద చికిత్స నిరాకరించడం, రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుండడాన్ని గుర్తించిన బృందం ఎక్కడికక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది.

కాగా ఏపీ వ్యాప్తంగా ఇ‍ప్పటి వరకు 30 ఆసుపత్రులపై దాడులు నిర్వహించిన విజిలెన్స్‌ అధికారులు 6 ఆస్పత్రులపై కేసులను నమోదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఒక ఆస్పత్రిపై అధిక ఫీజులు వసూలు చేసినందుకు కేసు నమోదు చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పుత్తూరు సుభాషిణి ఆస్పత్రిపై ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి నిరాకరించినందుకు కేసును నమోదు చేశారు. విజయవాడలోని వేదాంత ఆస్పత్రి , శ్రీకాకుళం లోని సూర్యముఖి ఆస్పత్రులు పేషెంట్లు స్వంతంగా రెమిడిసివర్‌ తెచ్చుకోవాలని పట్టుబట్టడంతో వాటిపై కూడా కేసులను బుక్‌ చేశారు. కాగా కడప జిల్లా సిటీ కేర్‌ ఆస్పత్రి కరోనా బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసింది. పైగా వాటికి బిల్లులు ఇ‍వ్వలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఫిర్యాదులు అందిన ప్రతి ఆస్పత్రులపై కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెండ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.