Begin typing your search above and press return to search.

జగన్‌పై వల్లభినేని వంశీకి ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?

By:  Tupaki Desk   |   24 Oct 2021 10:30 AM GMT
జగన్‌పై వల్లభినేని వంశీకి ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?
X
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తారు. ఒకవేళ మీడియా ముందు వచ్చారంటే బద్దలు కావాల్సిందే. ప్రత్యర్థిపై పులిలా దూకుతారు. ప్రస్తుతం ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అట్లని వైసీపీలో చేరడం లేదు. పైగా టీడీపీ నుంచి గెలిచి ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో మొదలుకుని అందరిపై ఆగ్రహంతో ఊగిపోతుంటారు. అయితే సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలు... ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం చంద్రబాబు దీక్ష సందర్భంగా మాజీమంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ చంద్రబాబును మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ నోటి కొచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు. నాని, వంశీ కాళ్ల కింద చెప్పుల్లా ఉండే వ్యక్తులని అన్నారు. చంద్రబాబు దయవల్ల ఎమ్మెల్యేలు అయ్యి ఆయననే ఇష్టమెచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు. వంశీ, నాని లాంటి వ్యక్తులను చిత్తుచిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సునీత హెచ్చరించారు.

సహజంగానే సునీత వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ స్పందించారు. వదిన అని సంబోధిస్తూనే ఆమెపై విమర్శలు, సవాళ్లు విసిరారు. అంతవరకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన మాట్లాడుతూ ఒక్క సారిగా వారసత్వ రాజకీయాలను తెరపైకి తెచ్చారు. తన గురించి, కొడాలి నాని గురించి వివరిస్తూ వచ్చే క్రమంలో కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌పై నర్మగర్భంగా సుతిమెత్తగా వంశీ, విమర్శులు చేశారనే చర్చ నడుస్తోంది. ఎలాగంటే తాను కొడాలి నాని, వాస్తవిక వాదులమని, మొదటి తరం నాయకులమని చెప్పారు. తాము ఎవరి దయతోను ప్రాపకంతోనూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. తల్లి, తండ్రి, ముత్తాత చనిపోతేనో వారి వారసులుగా రాజకీయాల్లో అడుగుపెట్టలేదని గుర్తుచేశారు. తమకు తొచినంత సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామని వంశీ వివరించారు. అయితే వంశీ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్, తన తండ్రి వైఎస్ఆర్ మరణానంతరం రాజకీయాల్లో వచ్చారు. వైఎస్ఆర్ వారసుడిగానే ఆయనపై బలమైన ముద్ర ఉంది.

జగన్ తన స్వశక్తితో పాటు వైఎస్ఆర్ ప్రభావంతోనే సీఎం పీఠంపై కూర్చున్నారనే విషయం నమ్మదగ్గ సత్యం. వంశీ అనుకోకుండా యథాలాపంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా... లేక పోతే ఇందులో ఏమైనా దురుద్దేశాలున్నాయా అనే అనుమానాలు మొదలయ్యాయి. జగన్‌పై ఏదో మనసులో పెట్టుకునే ఇలా సెటైర్లు వేశారా అని భావించేవారు లేక పోలేదు. జగన్‌పై ఆయనకు అంతర్గతంగా భేదాభిప్రాలున్నాయనే చర్చకూడా సాగుతోంది. ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి భౌతికంగా బయటకు వచ్చారనే తప్ప.. అధికారికంగా వైసీపీలో చేరలేదు. అట్లని ఆయన ఊరికే ఉండలేదు. టీడీపీ నాయకులపై ఓ యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. అలాంటప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని టీడీపీ నేతలు ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు. వంశీ అంతర్గతంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టే.. వైసీపీలో చేరలేదని ప్రచారం జరుగుతోంది.దీనికి కారణం ఎవరనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సిద్ధపడితే తానే ఆ లేఖను స్పీకర్ పంపవచ్చని, అలాకాకుండా ఖాళీ లెటర్ ప్యాడ్‌పై సంతకం చేసి సునీతను స్పీకర్‌కు పంపమని సవాల్ విసరడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సో.. ఏది ఏమైనా మరోసారి వారసత్వ రాజకీయాలను వంశీ తెరపైకి తెచ్చారు. ఎవరిని ఉద్దేశించి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.