Begin typing your search above and press return to search.

వీహెచ్ రాయబారం... మెత్తబడ్డ కోమటిరెడ్డి

By:  Tupaki Desk   |   28 Nov 2021 12:30 AM GMT
వీహెచ్ రాయబారం... మెత్తబడ్డ కోమటిరెడ్డి
X
నేనీదరిని.. నువ్వా దరిని.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. ఈ పాట ఓ సినీ కవి ఏ సందర్భంలో రాశారో తెలియదు గానీ ప్రస్తుతం ఇద్దరు నేతలకు సరిగ్గా సరిపోయింది. చాలా కాలం నుంచి దూరంగా ఉన్న ఆ నేతలను వరి దీక్ష కలిపింది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. అంతటితో ఆగకుండా వీలు దొరికినప్పుల్లా రేవంత్‌పై కోమటిరెడ్డి విమర్శలు సంధిస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరు టీపీసీసీ అధ్యక్ష పదివి కోసం పోటీ పడ్డారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం.. చివరికి రేవంత్ రెడ్డినే ఎంపిక చేసింది. ఇక అప్పటి నుంచి కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దూరంగా ఉంటే పర్వేలేదు. ఓ సందర్భంగా కోమటిరెడ్డి.. కాంగ్రెస్‌ను వీడుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఏమైందో తెలీదు గానీ చివరికి మాత్రం ఆయన కాంగ్రెస్‌ను మాత్రం వీడలేదు. పార్టీ నియమాలను ధిక్కరించిన కోమటిరెడ్డిపై అధిష్టానం కూడా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కోమటిరెడ్డి మనసు కరుగుతుందేమో అని అధిష్టానం ఆశగా ఎదురుచూసింది. ఎట్టకేలకు కోమటిరెడ్డి కరిగిపోయారు.

రైతుల చివరి ధాన్యం గింజ వరకూ ప్రభుత్వం కొనాల్సిందేనన్న డిమాండ్‌తో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వరి దీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలంతా హాజరయ్యారు. రైతన్న కన్నీళ్లను తుడవడానికి కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న దీక్షకు ఒక ఉద్యమ నేతగా, రైతు బిడ్డగా తాను హాజరవుతున్నట్లు ఒక ప్రకటించిన కోమటిరెడ్డి.. అనుకున్నట్లే దీక్షకు వచ్చారు. రేవంత్ రెడ్డ పక్కనే కూర్చున్నారు. ఇన్ని రోజులు ఎడముఖం పెడ ముఖంగా ఉన్న ఇద్దరి నేతల మధ్య మాటలు సాగాయి. రేవంత్, కోమటిరెడ్డి కలుసుకోవడంతో కాంగ్రెస్ నేతలు పుల్ జోష్ లో ఉన్నారు. ఇక నుంచి పార్టీ కార్యక్రమాలను ఇలాగే కలిసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డిని బుజ్జగించే బాధ్యతను సీనియర్ నేత హనుమంతరావుకు అప్పగించారు. ఆయన పలు దఫాలు చర్చలు కూడా జరిపారు. వీహెచ్ సూచనతోనే కోమటిరెడ్డి దీక్షకు వచ్చారని చెబుతున్నారు. కోమటిరెడ్డిని వీహెచ్ రిసీవ్ చేసుకుని రైతు కండువా కప్పారు. మొదట్లో కోమటిరెడ్డి వేదికపై ఇబ్బంది పడ్డా తర్వాత సర్ధుకున్నారు. వీహెచ్ జోక్యం చేసుకుని ఏదో కోమటిరెడ్డికి చెప్పారు. ఆ తర్వాత రేవంత్ తో ఆయన కలిసి మాట్లాడారు. కొద్ది సేపు వేదికపై ఉండి తర్వాత కోమటిరెడ్డి వెళ్లిపోయారు. అయితే తాను రైతు బిడ్డగా హాజరవుతున్నట్లు ఒక ప్రకటించిన కోమటిరెడ్డి.. నల్లచొక్కతో దీక్షకు వచ్చారు. ఆయన నల్లచొక్కా దేనికి నిదర్శమనే చర్చ ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి వ్యతిరేకంగా అవలంభిస్తున్న నిర్ణయాలకు నిరసనగా నల్లచొక్కా ధరించారా? లేకపోతే పార్టీ నిర్ణయాలను నిరసిస్తూ ఇలా చేశారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.