Begin typing your search above and press return to search.

భారత్ కంటే చైనా, పాకిస్తాన్ లకే అమెరికా ప్రాధాన్యమా?

By:  Tupaki Desk   |   29 Sep 2022 11:34 AM GMT
భారత్ కంటే చైనా, పాకిస్తాన్ లకే అమెరికా ప్రాధాన్యమా?
X
అమెరికా టూర్ కు ప్లాన్ చేస్తున్నారా? అగ్రరాజ్యంలో అలా విహరించడానికి వెళుతున్నారా? అయితే ఇప్పట్లో ఆ దేశానికి వెళ్లడం కష్టమే. కనీసం రెండేళ్ల వరకూ కూడా ఖాళీలేని పరిస్తితి. అంతలా రష్ ఉంది మరీ.. అమెరికాకు సందర్శకుల వీసాల జారీలో విపరీతమైన జాప్యం భారతీయుల ప్రయాణ ప్రణాళికలు.. బడ్జెట్‌లను గందరగోళానికి గురిచేస్తోంది. మొదటిసారిగా అమెరికాకు వలసేతర విజిటర్ వీసా పొందాలనుకునే భారతీయ పౌరులు దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ప్రకారం.. వీసా కోరుకునే దరఖాస్తుదారులు ఢిల్లీ, ముంబైలో వరుసగా 758 మరియు 752 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతగా వెయిటింగ్ పీరియడ్ ఉంది.మన హైదరాబాద్ లోనూ ఏకంగా 582 రోజులు ఆగాల్సి వస్తోంది.

భారతీయ వీసా దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ పొందేందుకు రెండేళ్లకు పైగా వేచి ఉండాల్సిన అవసరం ఉందని అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్ తాజాగా తెలిపింది. అయితే చైనా వంటి దేశాలకు కాలపరిమితి రెండు రోజులు మాత్రమే కావడం ఇక్కడ గమనార్హం.

విజిటర్ వీసాల కోసం హైదరాబాద్ నుండి దరఖాస్తు దారులు 582 రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. ముంబై నుండి ఏకంగా 848 రోజుల అపాయింట్‌మెంట్ వెయిట్-టైమ్ ఉందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ చూపిస్తుంది. దీనికి విరుద్ధంగా చైనాలోని బీజింగ్‌కు రెండు రోజులు మాత్రమే ఉంది. ఇక పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్‌కు 450 రోజులు మాత్రమే కావడం విశేషం.

విద్యార్థి వీసాల కోసం హైదరాబాద్, ఢిల్లీ మరియు ముంబైకి 430 రోజుల నిరీక్షణ సమయం ఉండగా.. ఆశ్చర్యకరంగా ఉగ్రవాద పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్‌కు ఒక రోజు మాత్రమే ఉండడం చర్చనీయాంశంగా మారింది. మనకంటే పాకిస్తాన్, చైనాలే అమెరికాకు నయమా? అని విమర్శిస్తున్నారు.

కరోనా మహమ్మారి సమయంలో తక్కువ దరఖాస్తుల కారణంగా వీసా ప్రక్రియను నిర్వహించే సిబ్బందిని తగ్గించడం వల్ల బ్యాక్‌లాగ్ ఏర్పడిందని అమెరికా వర్గాలు తెలిపాయి.

కోవిడ్ అనంతర కాలంలో స్టూడెంట్ మరియు టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తులు పెరగడం, వారికి తగిన సిబ్బంది లేనందున బ్యాక్‌లాగ్‌కు దారితీసిందని అమెరికా ప్రభుత్వ వర్గాలు వివరించారు.అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అన్ని మిషన్ ఇండియా పోస్ట్‌లను వారి అత్యున్నత స్థాయికి పెంచడానికి దూకుడుగా ప్రణాళికలు రూపొందించిందని అధికారి తెలిపారు.

కొత్త అధికారులను నియమించడం.. శిక్షణ ఇవ్వడం మరియు కాన్సులర్ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడం జరుగుతుందని, రాబోయే నెలల్లో హైదరాబాద్‌లో కొత్త విస్తరించిన సౌకర్యాన్ని ప్రారంభించబోతున్నామని ఆయన చెప్పారు.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.