Begin typing your search above and press return to search.

'ఉండి'.. వైసీపీ రాజ‌కీయాల‌కు మొండి...!

By:  Tupaki Desk   |   17 Aug 2022 10:51 AM GMT
ఉండి.. వైసీపీ రాజ‌కీయాల‌కు మొండి...!
X
ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం ద‌క్కించు కుంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. వైసీపీ జెండా ఎగుతుంద‌ని అధిష్టానం ఆశ‌లు పెట్టుకుంది. అయితే.. ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అంత సీన్ లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఆది నుంచి ఉండి వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓటమి పాలైంది. అప్పట్లో పోటీ చేసి ఓడిపోయిన పీవీఎల్‌ నరసింహరాజుకు పార్టీ బాధ్యతను అప్పగించినట్టే అప్పగించి కొద్ది కాలం తరువాత ఆ బాధ్యతల నుంచి వైసీపీ తప్పించింది.

ఆ స్థానంలో సీనియర్‌ నేత గోకరాజు రామానికి కళ్లాలు అప్పగించారు. ఉండి నియోజక వర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సర్రాజును కాదని, ఆయనకు క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి అప్పగించేశారు. తీరా ఉండి నియోజక వర్గంలో మండలాల వారీగా వైసీపీలో గ్రూపులు తలెత్తాయి.

పీవీఎల్‌ కు అనుకూలంగా కొందరు, రామంకు ఇంకొందరు ఎవరంతట వారుగా వ్యవహరించారు. ఇది కాస్తా ముదిరి ముదిరి ఈ మధ్యకాలంలోనే గడపగడపకు కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను పీవీఎల్‌కే అప్పగిస్తూ పార్టీ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న రామాన్ని క్రమేపీ బలహీనపరిచే విధంగానే ఈ చర్యలు ఉన్నాయని ఆయన అనుకూల వర్గం యావత్తు అసంతృప్తిలో పడింది. దీనికి తగ్గట్టుగానే రామంకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారందరిలో ఒక్కొక్కరిని బాధ్యతల నుంచి తప్పించి తమ అనుచరులను నియమించుకునే విధంగా పీవీఎల్‌ వ్యవహరిస్తున్నారనేది మరో వాదన వినిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే కొందరు జడ్పీటీసీలు సైతం పార్టీకి దూరంగా జరుగుతున్నారు.

పాలకోడేరు జడ్పీటీసీ స్థానిక పార్టీ కార్యక్రమాల్లో ఇమడలేనంటూ తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. దీంతోనైనా కళ్లు తెరిచి పార్టీలో పేట్రేగుతున్న అసంతృప్తులను కాస్తంత బుజ్జగిస్తారని అందరూ ఎదురుచూశారు. కానీ వీటిని పట్టించుకోకుండా ఎవరికి వారు ఇక్కడ కత్తులు దుయ్యడం ప్రారంభించారు. ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు ప్రశ్నించే విధంగా వ్యవహారం సాగుతోంది. ఇవన్నీ కలబోసి వైసీపీ వ్యవహారాలన్నీ రోడ్డు మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోందని భావిస్తున్నారు. ఏతావాతా తేలిందేంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ.. ఇక్క‌డ వైసీపీ జెండా ఎగ‌ర‌డం క‌ష్ట‌మేన‌ని! మ‌రి అధిష్టానం చివ‌రి నిముషంలో ఏం చేస్తుందో చూడాలి.