Begin typing your search above and press return to search.

మోగని గంటా : సొంత సామాజిక వర్గం నుంచే పొగ...?

By:  Tupaki Desk   |   16 May 2022 8:56 AM GMT
మోగని గంటా : సొంత సామాజిక వర్గం నుంచే పొగ...?
X
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం మూడేళ్ళుగా సజావుగా సాగడంలేదనే అంటున్నారు. ఆయన అనుకున్నది ఒకటి, జరిగేది వేరొకటి అన్నట్లుగా సీన్ ఉంది. నిజానికి అన్నీ అనుకూలిస్తే 2019 ఎన్నికల ముందు గంటా వైసీపీలో చేరి మినిష్ఱ‌ర్ అయ్యేవారు అని అప్పట్లో ప్రచారంలో ఉన్న విషయం. ఆయన కంటే ముందు అవంతి శ్రీనివాసరావు వైసీపీలోకి రావడంతో కధ మొత్తం మారిపోయింది.

ఇక గంటా జగన్ వేవ్ లో ఉత్తర నియోజకవర్గం సీటు గెలిచినా టీడీపీ అధినాయకత్వంతో గ్యాప్ మాత్రం అలా కొనసాగుతూ వస్తోంది. ఆ మధ్యన గంటా కాపు నేతలను విశాఖ తీసుకువచ్చి మీటింగులు పెట్టారు. దాని కంటే ముందు హైదరాబాద్ లో కూడా గంటా కాపు నాయకులతో భేటీలు నిర్వహించారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలోని కాపుల మద్దతు మొత్తం గంటాకేనా అన్న చర్చ ఒక వైపు ఉంటే ఆయన కాదు మేమూ లీడర్లమే అని సొంత సామాజికవర్గం నుంచి గంటాకు పొగ పెట్టే వారు రెడీ అయిపోయారు.

గంటా తనకు ఉన్న బలమైన ఓటు బ్యాంక్ ఆసరాతో ఏపీ రాజకీయాల్లో తన మార్కుని చూపించాలని చూస్తున్నారు. అయితే గంటాతో భేటీ అయిన వారు కానీ లేక కాపుల్లో ప్రముఖులు కానీ తమ రాజకీయ దారి తాము చూసుకుంటూ తమ అజెండాతో తాము వెళ్తున్నారు. ఇలా అందరికీ ఒక త్రాటి మీద తేవడం అంటే కష్టమైన విషయమే. ఇక కాపులకు ఐకాన్ గా మారాలన్న గంటా ఆకాంక్ష కూడా తీరడంలేదు.

ఆయన తనకోసమే రాజకీయాలు చేస్తారని, ఆయన పదవుల కోసం నిచ్చేలా మిగిలిన వారిని వాడుకుంటారని సొంత సామాజికవర్గంలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా ఐక్య కాపు వేదిక నాయకులు గంటా తీరుని తప్పు పడుతూ ఘాటు విమర్శలు చేయడం విశేషం. ఐక్య కాపు వేదిక నాయకుడు తోట రాజీవ్ అయితే గంటా కాపులకు చేసిన మేలు ఏమీ లేదని గట్టిగానే విమర్శించారు.

కాపుల ఆకాంక్షలను ఆయన ఎపుడూ పట్టించుకోలేదని, అదే సమయంతో తనకు అనుకూలంగా కులాన్ని వాడుకున్నారని విమర్శిస్తున్నారు. ఇక విశాఖలో కాపుల సంక్షేమం కోసం భవనం నిర్మిస్తామని గంటా తన అయిదేళ్ల పదవీ కాలంలో చెప్పిన మాటలు ఆచరణకు నోచుకోలేదని ఆయన అంటున్నారు. టీడీపీ అధికారం చివరి రోజుల్లో కాపుల భవనానికి కేవలం శంకుస్థాపన చేసి గంటా ఊరుకున్నారని ఆయన అంటున్నారు.

ఇక తాము మాత్రం ప్రస్తుత ప్రభుత్వాన్ని పట్టుకుని అనేక విన్నపాలు చేసి కాపుల కోసం ఒక భవన నిర్మాణానికి ఉచితంగా స్థలం సేకరించామని, తొందరలోనే భవన నిర్మాణం కూడా చేపడతామని చెప్పారు. తమది కాపులకు సేవ చేసే నిజమైతే ప్రేమ అయితే మాజీ మంత్రిది మాటల వరకే ఉన్న ప్రేమని అంటున్నారు. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర నియోజకవర్గం నుంచే బలమైన కాపు నాయకులు ఇలా మాజీ మంత్రి గురించి చెప్పడం సంచలంగా మారుతోంది.

అంతే కాదు గంటాకు ఇపుడు పొలిటికల్ గా ఎక్కడా సీన్ లేదని రాజీవ్ కామెంట్స్ చేయడం కూడా గమనార్హం. ఆయన ఉన్న పార్టీలో విలువ లేదని, మిగిలిన పార్టీలు కూడా ఆయన్ని చేరదీయడం లేదని అంటున్నారు. అంటే గంటా పొలిటికల్ లైఫ్ డైలామాలో ఉందని ఆయన చెబుతున్నారు అన్న మాట. మరి కాపు నేతల వరస భేటీలతో గంటా ఒక దశలో ఏపీలో ఆల్టర్నెషన్ పాలిటిక్స్ తానే రూపకర్తను అని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

మరి గంటా వేస్తున్న అడుగులు తడబడుతున్నాయా లేక ఆయన రాజకీయ వ్యూహాలు బెడిసికొడుతున్నాయా అన్న చర్చ అయితే గట్టిగా సాగుతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల తరువాత అధికారం అందుకోవాలని, మళ్ళీ మంత్రిగా కనిపించాలని ఆరాటపడుతున్న గంటా ఇపుడు ఏం చేయబోతున్నారు అన్నదే చూడాలంటున్నారు. ఒకనాడు చక్రం తిప్పిన మాజీ మంత్రి ఇపుడు అయోమయంలో పడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.