Begin typing your search above and press return to search.

ప్రేమ కోసం స్విట్జర్లాండ్‌..ప్రేయసి కోసం పాకిస్థాన్

By:  Tupaki Desk   |   20 Nov 2019 7:48 AM GMT
ప్రేమ కోసం స్విట్జర్లాండ్‌..ప్రేయసి కోసం పాకిస్థాన్
X
ప్రేమ .. ఈ రెండు అక్షరాలకు ప్రపంచంలో ఏది సాటిరాదు ..లేదు. ప్రేమ ఉంటే ఏదైనా కూడా మన దగ్గరికే వచ్చి చేరుతుంది. ప్రేమ కల్లాకపటం లేనిది. ఉన్నవారు - లేని వారు అని బేధం చెప్పునది ఈ ప్రేమ ఒక్కటే. ఈ ప్రేమ మైకం లో ఉంటే ఏంచేస్తున్నామో కూడా అర్థంకానీ స్థితిలో కొంతమంది ఉంటారు. అలాగే ఈ ప్రేమ మనల్ని ఆ స్వర్గపు అంచులదాకైనా తీసుకుపోగలదు. నరకానికి దారి కూడా చూపించగలదు. అలానే ఈ మధ్య కాలంలో ఈ ప్రేమ పేరుతొ మోసం చేసే వారు కూడా ఎక్కువై పోతున్నారు. ఏదేమైనా ప్రేమకి ఉన్న విలువ మాత్రం తగ్గదు.

ఒక ప్రేమికుడు తన ప్రేమ కోసం కన్న తల్లిదండ్రులని - మంచి ఉద్యోగాన్ని వదిలేసి స్విట్జర్లాండ్‌ కి బయల్దేరి వెళ్ళాడు. కానీ , ప్రేమ కోసం స్విట్జర్లాండ్‌ వెళ్ళాలి అనుకున్న ఆ యువకుడు రెండేళ్ల తరువాత పాక్ లో ప్రత్యక్షం అయ్యాడు. అసలు స్విట్జర్లాండ్‌ వెళ్లాల్సిన ఆ ప్రేమికుడు పాక్ ఎందుకు వెళ్ళాడు ..అసలు ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రేమ కోసం వెళ్లి పాక్ కి పట్టుబడ్డ యువకుడి పేరు ప్రశాంత్. ప్రశాంత్‌ తండ్రి బాబూరావుది ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామం. ఆయనకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు శ్రీకాంత్‌ - చిన్నవాడు ప్రశాంత్‌. ఉద్యోగరీత్యా బాబూరావు విశాఖపట్నంలోని వుడా మిథిలాపురి కాలనీ.. గంగా రెసిడెన్సీ అపార్టుమెంట్‌ లో ఉండేవారు. పిల్లలిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కావడంతో.. ఐదేళ్ల క్రితం కూకట్‌ పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీకి మకాం మార్చేశారు. ఇక 2011-12లో ప్రశాంత్‌ బెంగళూరులోని హువేయి టెక్నాలజీస్ లో కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగంలో చేరాడు. ఆ కంపెనీ తరఫున చైనా - దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చాడు. అప్పట్లోనే స్వప్నికాపాండే అనే తోటి ఉద్యోగితో ప్రేమలో పడ్డాడు. కానీ , ఆ ప్రేమ విఫలం అయ్యింది. దీనితో మానసికంగా కృంగిపోయాడు. ఆ తరువాత తల్లిదండ్రులు అతడిని హైదరాబాద్‌ కు తీసుకువచ్చి.. మానసిక చికిత్స చేయించారు. కొద్దీ రోజులకి కోలుకున్న ప్రశాంత్‌ 2016లో మాదాపూర్‌ లోని షోర్‌ ఇన్ఫోటెక్‌ లో చేరారు. 2017 ఏప్రిల్‌ 11న ఉద్యోగానికి వెళ్లి - ఇంటికి తిరిగి రాలేదు.

దీనితో ప్రశాంత్‌ తండ్రి బాబూరావు అదే నెల 29న మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ,ఈ కేసులో ఎటువంటి క్లూ లేకపోవడం - గతంలో ఒకసారి ప్రశాంత్ ఇంట్లో నుండి వెళ్లిపోవడం తో పోలీసులు కేసుని మూసేసారు. కానీ , తాజాగా పాకిస్థాన్‌ మీడియా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో గూఢచర్యం అభియోగంతో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీరు వి.ప్రశాంత్‌ అరెస్ట్ అయ్యాడని కథనాలు ప్రసారం చేయడంతో పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. రాజస్థాన్‌ ఎడారి ప్రాంతమైన కొలిస్థాన్‌ నుంచి పాకిస్థాన్‌ లోకి అక్రమంగా ప్రవేశించి.. అక్కడి పోలీసులకు దొరికాడు.

ఇకపోతే ప్రశాంత్ ప్రేయసి స్వప్నికాపాండే స్వస్థలం మధ్యప్రదేశ్‌. ఆమెను వెతికే క్రమంలోనే అతడికి దరీలాల్‌ పరిచయం అయ్యి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రశాంత్‌ ఆమెను వెతికేందుకు దరీలాల్‌ సహాయం తీసుకుని ఉంటాడని.. ఆ క్రమంలో రాజస్థాన్‌ థార్‌ ఎడారిలో తప్పిపోయి.. పాకిస్థాన్‌ సరిహద్దులు దాటి ఉంటారని భావిస్తున్నారు. కానీ , ప్రేయసి కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లాల్సిన ప్రశాంత్ .. రాజస్థాన్‌ కు ఎందుకు వెళ్లాడనే కోణంలో ఈ కేసుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రశాంత్ ని ఎలాగైనా పాక్ నుండి విడిపించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.