Begin typing your search above and press return to search.

మండలిలో వైసీపీకి షాక్.. బిల్లుకు బ్రేక్ వేసిన చైర్మన్

By:  Tupaki Desk   |   21 Jan 2020 8:46 AM GMT
మండలిలో వైసీపీకి షాక్.. బిల్లుకు బ్రేక్ వేసిన చైర్మన్
X
శాసనసభలో 151మంది ఎమ్మెల్యేల బలంతో ఏపీకి మూడు రాజధానులు - సీఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదించుకున్న వైసీపీ సర్కారుకు శాసనమండలిలో షాక్ తగిలింది. ఏపీ శాసన మండలిలో వైసీపీకి తగినంత ఎమ్మెల్సీల బలం లేకపోవడంతో ఇక్కడ బిల్లు పాస్ అవుతుందా లేదా అన్న టెన్షన్ ఉండేది. ఆ అనుమానాలకు బలం చేకూరేలా ఈరోజు శాసనమండలిలో వైసీపీకి షాక్ తగిలింది.

ఏపీకి మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందడంతో మండలిలో ప్రవేశపెట్టేందుకు మంత్రి బుగ్గన రెడీ అయ్యారు. అయితే అనూహ్యంగా టీడీపీ రూల్71 కింద నోటీసులు ఇచ్చింది. బిల్లులను ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసులపై చర్చ జరపాలని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అయితే దీనికి ఒప్పుకోని మంత్రి బుగ్గన మొదట వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందినందున దాన్నే చర్చించాలని పట్టుబట్టారు.

ఈ నేపథ్యంలో దీనిపై మండలి చైర్మన్ స్పందించారు. వైసీపీకి షాకిచ్చారు. టీడీపీ ఇచ్చిన రూల్ 71 నోటీసులపై చర్చకు అనుమతిచ్చారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు సెక్షన్ 71 కింద మండలికి ఉంటుందని టీడీపీ శాసన మండలి నేత యనమల స్పష్టం చేశారు. దీంతో మండలి చైర్మన్ తీరుపై వైసీపీ మంత్రులు భగ్గుమన్నారు. ఇదేంటని నిలదీశారు. సభలో గందరగోళం చోటుచేసుకోవడంతో సభను చైర్మన్ వాయిదా వేశారు.

మొత్తానికి అనుకున్నట్టే మండలిలో టీడీపీ పంతం నెగ్గించుకుంది. వైసీపీ ప్రభుత్వం ఏపీ 3 రాజధానుల బిల్లును అడ్డుకుంది.

బిల్లు కనుక మండలిలో వీగిపోతే డీమ్డ్ టు బీ పాస్ట్ కింద ప్రభుత్వం ఆమోదించుకోవచ్చు. కానీ బిల్లే పెట్టకపోతే బిల్లుపై ముందుకెళ్లడం కష్టం. ఇప్పుడు 71 రూలింగ్ కింద టీడీపీ వేసిన స్కెచ్ తో మండలిలో ఏపీ 3 రాజధానుల బిల్లుపై సస్పెన్స్ నెలకొంది.