Begin typing your search above and press return to search.

పీఎంవోకు.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి వెయ్యి లేఖలు

By:  Tupaki Desk   |   13 May 2022 2:33 PM GMT
పీఎంవోకు.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి వెయ్యి లేఖలు
X
ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి.. ఓ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి.. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో)కు రాసిన లేఖల సంఖ్య ఇది. 71 ఏళ్ల ఆ ఉద్యోగి.. తన పట్టా భూమికి రిజిస్ట్రేషన్ కోరుతున్నాడు. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో విసిగిపోతున్నాడు. చిత్రమేమంటే.. పీఎంవోకు 1,003 లేఖలు రాసిన అతడు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)కు వందకుపైగా లేఖలు రాశాడు. అయితే, ఎటువైపు నుంచి కూడా అతడికి సమాధానం, పరిష్కారం లభించలేదు.

ఆ రిటైర్డ్ ఉద్యోగి పేరు జి.రాంప్రసాద్. ఓ ఆగ్రో ఫిర్మ్ లో షేర్ హోల్డర్. ఆయన పట్టా స్థలం అకస్మాత్తుగా అసైన్డ్ భూమిగా మారింది. తిరిగి తన పేరిట పట్టా చేయాలని కోరుతున్నాడు. కానీ, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) నుంచి కానీ, ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్ మెంట్ ప్రధాన కార్యాలయం నుంచి కానీ స్పందన లేదు. దీంతో విసుగెత్తిన అతడు రోజూ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖలు రాస్తూ ఉన్నారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నారు.

రాంప్రసాద్ చెబుతున్నదాని ప్రకారం ఆయన భూమి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నది. ఏడేళ్లుగా సమస్యను ఎదుర్కొంటున్నాడు. సీఎంవో, సీసీఎల్ ఏ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎవరి వద్దా ఆయనకు పరిష్కారం లభించలేదు. రాంప్రసాద్.. సువర్ణ ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో షేర్ హోల్డర్.

శంషాబాద్ సమీపంలోని సయ్యద్ గూడ వద్ద ఈ సంస్థ 38 ఎకరాల వెంచర్ వేసినట్లు తెలుస్తోంది. 1954 నుంచి 2006 వరకు ఉన్న రికార్డుల ప్రకారం ఇది పూర్తిగా ప్రయివేటు పట్టా భూమి. కానీ, 2006 తర్వాత అసైన్డ్ భూమిగా మారింది. దీనిపైనే ప్రసాద్, మరికొందరు పోరాటం చేస్తున్నారు.

అమ్మింది ఓ కీలక వ్యక్తి..సువర్ణ ఆగ్రో ఫామ్స్ కు భూమి అమ్మినది న్యాయ వ్వవస్థ లోని ఓ కీలక వ్యక్తి కావడం గమనార్హం. ఆ వ్యక్తి నుంచి 1994లో ఈ సంస్థ భూమిని కొన్నది. 1949 నుంచి పట్టా భూమిగానే ఉన్న ఆ భూమి గత 50 ఏళ్లలో అనేక మంది చేతులు మారిందని ప్రసాద్ పేర్కొంటున్నాడు.

రెవెన్యూ రికార్డుల్లో అసలు యజమానుల పేర్లూ ఉన్నట్లు చెబుతున్నాడు. కాగా, 2015లోనే పీఎంవో.. తన లేఖలకు స్పందించి సీఎంవో, రెవెన్యూ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చిందని ఆయన వివరిస్తున్నాడు. అయినా,పరిష్కారం లభించలేదని ఆరోపిస్తున్నాడు. మరోవైపు ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పందించారు. పీఎంవో లేఖను పరిశీలించమనే సూచిస్తుందని.. ఆదేశించలేదని పేర్కొన్నారు. అన్యాయం జరిగినట్లు భావించినవారు కోర్టుకు వెళ్లొచ్చని స్పష్టం చేశారు.