Begin typing your search above and press return to search.

సమరానికి సై అంటోన్న చైనా, అమెరికాలు

By:  Tupaki Desk   |   27 Aug 2020 5:30 PM GMT
సమరానికి సై అంటోన్న చైనా, అమెరికాలు
X
కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. చైనా నుంచి కరోనా వైరస్ వచ్చిందని, కరోనాపై నిజాలను చైనా దాచిపెట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారాలు మిరియాలు నూరుతున్నారు. చైనీస్ వైరస్ వల్లే ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయంటూ చైనాతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇదిలా ఉండగా, చాలా కాలం నుంచి దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం పోటీపడుతోన్న అమెరికా, చైనాలు....పలు మార్లు యుద్ధ విన్యాసాలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా, మరోసారి ఆ ప్రాంతంపై పట్టుకోసం అమెరికా, చైనాలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నాయి. యుద్ధ ట్యాంకర్లతో భూమిపై చైనా యుద్ధ విన్యాసాలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతుండగా, వాయుమార్గం ద్వారా యుద్ధ విమానం `యూ-2`తో అమెరికా సమరానికి సై అంటోంది. దానికి బదులుగా చైనా 2 బాలిస్టిక్ మిస్సైళ్లను వదలడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.

గత 3 రోజులుగా అమెరికా, చైనాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చైనాకు ఉత్తరంగా ఉన్న బొహాయి సముద్ర తీరంలో చైనా నౌక, సైనిక దళాలు మంగళవారం యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఆ సమయంలో అమెరికాకు చెందిన నిఘా విమానం యూ-2 `నో ఫ్లై జోన్` లోకి దూసుకువచ్చిందని, ఇది అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించడమేనని చైనా ఆరోపించింది. ఆ ఆరోపణలను అమెరికా కొట్టిపారేసింది.

దానికి బదులుగా చైనా 2 డీఎఫ్ శ్రేణి క్షిపణులను ప్రయోగించి `నో ఫ్లై జోన్` లోకి రావద్దంటూ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. చైనా పేల్చిన 2బాలిస్టిక్ మిస్సైళ్లలో ఒకటి జింగాయ్ ప్రావిన్స్ నుంచి, రెండోది భారత్ ను ఆనుకుని ఉన్న జిజియాంగ్ ఫ్రావిన్స్ నుంచి ప్రయోగించింది. భారత్ తో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ కు ఆనుకొని ఉన్న ప్రావిన్స్ నుంచి దక్షిణ చైనా సముద్రం వైపు మిసైల్ ఎందుకు పేల్చారన్న అంశంపై చర్చ జరుగుతోంది. అయితే, గురువారం నాటి మిసైల్ ప్రయోగంలో ఎలాంటి విధ్వంసం జరగలేదు.