Begin typing your search above and press return to search.

లోకేశ్ అనంత టూర్ పైనా కేసులు తప్పలేదు!

By:  Tupaki Desk   |   18 Jun 2020 6:30 AM GMT
లోకేశ్ అనంత టూర్ పైనా కేసులు తప్పలేదు!
X
ఏపీలో కేసుల హడావుడి నడుస్తోంది. ఏ చిన్న తప్పు చేసినా.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. దీంతో.. విపక్ష నేతలపైనా పలు కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల అరెస్టు నేపథ్యంలో.. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంత జిల్లా పర్యటనకు వచ్చారు.

ఈ సందర్భంగా తాడిపత్రికి వెళ్లిన లోకేశ్.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని.. ఆయన కుమారుడు జేసీ పవన్ ను పరామర్శంచారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు.. నేతలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన నిర్వాహకులపైన తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేసిన వైనం ఆలస్యంగా బయటకువచ్చింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేశ్ పర్యటన సందర్భంగా ముఖానికి మాస్కులు లేకుండా.. భౌతిక దూరాన్నిపాటించని తప్పుపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రఘునాథ.. సోమశేఖర్ పైనా జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద సెక్షన్ 51(బీ).. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో తాడిపత్రి పోలీసులు కేసునమోదు చేశారు. మొత్తానికి ఏ చిన్న అవకాశం లభించినా.. తెలుగు తమ్ముళ్లపై కేసు నమోదు విషయంలో ఏపీ పోలీసులుఏ మాత్రం వెనుకాడటం లేదన్న మాట వినిపిస్తోంది.