Begin typing your search above and press return to search.

జర జాగ్రత్త .. రాబోయే రెండు వారాలే కీలకం !

By:  Tupaki Desk   |   3 Aug 2021 2:30 PM GMT
జర జాగ్రత్త .. రాబోయే రెండు వారాలే కీలకం !
X
దేశంలో సెకండ్ వేవ్ తగ్గింది ఇక కరోనా పీడ పోయినట్టే అని అనుకునే సమయంలోనే దేశంలో కోవిడ్‌ కేసుల ట్రెండ్‌ క్రమంగా పెరుగుతోంది. మళ్లీ కరోనా తీవ్రస్థాయికి చేరుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి సీరియస్‌ కరోనా కేసులు ఇంకా ఇక్కడికి వస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారికి సంబంధించి రాబోయే రెండు , మూడు వారాలు కీలకంగా మారనున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ కరోనా ఆగస్ట్‌లో మొదలై అక్టోబర్‌ కల్లా పిక్స్ కి వెళ్లొచ్చని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్‌ పరిశోధకులు తాజాగా అంచనా వేశారు.

ఈ నెలలో దేశంలో రోజుకు లక్షన్నర కేసుల వరకు నమోదు కావొచ్చని హెచ్చరికలు జారీచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోని వైరస్‌ ఉద్ధృతి థర్డ్‌వేవ్‌ కు ఆజ్యం పోయొచ్చని ఐఐటీ–హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ మతుకుమల్లి విద్యాసాగర్‌ చెప్పారు. అయితే సెకండ్‌ వేవ్‌ లో మాదిరిగా అత్యంత తీవ్రస్థాయి ఉండక పోవచ్చన్నారు. ఏడాదిన్నరగా రెండు లాక్‌ డౌన్లు, వివిధ రకాల ఆంక్షలతో ప్రజలు విసిగి వేసారి ఉన్నారు. ఇలాంటి దశలో కోవిడ్‌ జాగ్రత్తలను పట్టించుకోకపోతే మళ్లీ కేసులు పెరిగి థర్డ్‌ వేవ్‌ కు దారితీసే ప్రమాదముందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ పాత జీవన విధానాన్ని కోరుకుంటూ స్వేచ్ఛగా అన్నిచోట్లకు వెళ్లే ప్రయత్నంలో నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు.

ప్రస్తుత దశను వారు పరీక్షా సమయంగా అభివర్ణిస్తున్నారు. చాలామంది అంతా మామూలై పోయినట్టుగా ప్రవర్తించడం, మాస్క్‌ లు పెట్టుకోకపోవడం, గుంపులు గుంపులుగా కనిపించడం, రెస్టారెంట్లు, పబ్‌లు, పార్టీలు అంటూ తిరగుతుండటంపై వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. డెల్టా ప్లస్‌ వేరియెంట్‌తో ప్రమాదం ఎక్కువగా ఉంది. లక్షణాలు కనిపించకపోవడంతో కొందరి ఆరోగ్యం విషమిస్తోంది. కేసుల పెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నా ప్రజలు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు సులభంగా వ్యాప్తి చెందడానికి అనువుగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

పలు రాష్ట్రాల్లో డెల్టా వేరియెంట్‌ ఇంకా ప్రబలంగా ఉంది. ప్రస్తుతమున్న డెల్టాతోనే నిబంధనలు పాటించని చోట కొత్త స్పైక్స్‌ రావొచ్చు. కేసుల సంఖ్య పదిరెట్లు పెరిగితేనే వేవ్‌ గా పరిగణించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిసి థర్డ్‌ వేవ్‌ గా మారడానికి నెలన్నర, రెండు నెలలు పట్టొచ్చు. అప్పుడు చిన్నపిల్లలతోపాటు అందరూ ప్రభావితమయ్యే అవకాశముంది. అయితే సెకండ్‌ వేవ్‌ లో ఉన్నంత ఉధృతి ఉండకపోవచ్చు. ఇప్పటికైతే థర్డ్‌ వేవ్‌ కు సంబంధించి ఎలాంటి వేరియెంట్లు ఇక్కడ పుట్టలేదు. మన రాష్ట్రంలో ఒక్క డోస్‌ టీకా కూడా వేసుకోకపోవడం లేదా ఇంకా వైరస్‌ బారిన పడని వారు 40 శాతం దాకా ఉన్నారు. ఆసుపత్రుల్లో మళ్లీ కోవిడ్‌ కేసుల అడ్మిషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బోనాలు, సీజన్‌ మార్పు తదితర కారణాలతో వచ్చే 15, 20 రోజుల్లో కేసుల సంఖ్య బాగా పెరిగితే థర్డ్‌ వేవ్‌ కు దారితీయొచ్చు. థర్డ్‌ వేవ్‌ వస్తే ఆ ప్రభావం అక్టోబర్‌ వరకు ఉండొచ్చు. కొత్త మ్యుటేషన్లు, స్ట్రెయిన్లు రాకుండా జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది