Begin typing your search above and press return to search.

నడిరోడ్డు మీద అమ్మాయిల చేత గుంజీళ్లు.. వాళ్లు చేసిన తప్పు ఇదే!

By:  Tupaki Desk   |   3 May 2021 11:30 AM GMT
నడిరోడ్డు మీద అమ్మాయిల చేత గుంజీళ్లు.. వాళ్లు చేసిన తప్పు ఇదే!
X
ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నడి రోడ్డు మీద అమ్మాయిల చేత గుంజిళ్లు తీయించారు పోలీసులు. సాధారణంగా అమ్మాయిలకు ఇలాంటి పనిష్మమెంట్ ఇవ్వరు. అందుకు భిన్నంగా.. మొహమాటానికి పోకుండా.. అమ్మాయిలైనా సరే శిక్ష తప్పదన్నట్లుగా చేసిన పోలీసులు తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ.. ఆ అమ్మాయిలు చేసిన తప్పేంటి? వారికి అంతలా శిక్ష వేసింది ఎక్కడి పోలీసుల అన్న విషయంలోకి వెళితే.

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరం లేకుంటే బయటకు రావొద్దంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. అయినప్పటికి చాలామంది వీరి మాటల్ని పెడచెవిన పెట్టి రోడ్ల మీదకు వస్తున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కొన్నిచోట్ల అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమన్న రీతిలో అమ్మాయిలు సైతం రోడ్ల మీదకు ఇష్టారాజ్యంగా తిరుగుతుండటం కనిపిస్తుంటుంది. అలాంటి వారిపై శిక్షల కొరడా విదిల్చారు మధ్యప్రదేశ్ పోలీసులు.

ఆ రాష్ట్రంలోని చందేరీ జిల్లాలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన అమ్మాయిలు రోడ్ల మీద తిరుగుతూ కనిపించారు. 144 సెక్షన్.. కర్ఫ్యూ లాంటి ఆంక్షలు అమలవుతున్న సమయంలో రోడ్ల మీదకు ఎందుకు వచ్చారంటే.. పొంతన లేని సమాధానాలు చెప్పటం షురూ చేశారు. అంతేకాదు.. నిత్యవసర వస్తువల కోసమో.. మరేదాని కోసమో కాకుండా ఉత్తినే వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు.. వారికి అనూహ్య రీతిలో ఇన్ స్టెంట్ శిక్షలు విధించారు.

చేసిన తప్పునకు గుంజిళ్లు తీయాలని పోలీసు అధికారి వారిని ఆదేశిస్తే.. తమను ఈసారికి వదిలేయాలని అమ్మాయిలు కోరారు. అయినప్పటికీ.. ససేమిరా అన్న ఆయన తప్పు చేస్తే శిక్ష తప్పదని తేలుస్తూ వారి చేత గుంజిళ్లు తీయించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోవైరల్ గా మారింది. పోలీసుల తీరును పలువురు అభినందిస్తున్నారు. తప్పు చేసింది ఎవరైనా సరే.. శిక్ష విధించటం తప్పేం కాదని వ్యాఖ్యానిస్తున్నారు.