Begin typing your search above and press return to search.

కరోనా జీవ బాంబులు , మాస్టర్ ప్లాన్స్ తో ఉగ్రవాదులు , యుఎన్ఐసిఆర్ఐ హెచ్చరికలు !

By:  Tupaki Desk   |   21 Nov 2020 12:10 PM GMT
కరోనా జీవ బాంబులు , మాస్టర్ ప్లాన్స్ తో  ఉగ్రవాదులు ,  యుఎన్ఐసిఆర్ఐ హెచ్చరికలు !
X
కరోనా గత ఏడాది కాలంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. రోజులు గడిచే కొద్ది కరోనా కేసులు , వ్యాధి తీవ్రత పెరుగుతూనే ఉంది. కానీ, తగ్గడం లేదు. వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనా జోరు ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. దీనికి తోడు ఇప్పుడు చలి తీవ్రత పెరిగిపోతుండటం తో కరోనా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే , ఈ కరోనా ను కూడా ఉగ్రవాదులు తమ ఆయుధంగా మార్చుకోబోతున్నారు.

గతంలో బాంబులతో విధ్వంసం సృష్టించి , ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసిన ఉగ్రవాదులు ఇప్పుడు కరోనాతో చంపేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా సమాచారం. అల్ ఖైదా , ఐఎస్ ఐఎస్ తదితర ఉగ్రవాద సంస్థలు కరోనా విజృంభణ ఆసరాగా చేసుకుని, కుట్రలకు తెగ పడుతున్నారని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ ఇంటర్ రీజినల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదికలో చెప్తూ అప్రమత్తంగా లేకపోతే భారీ నష్టం తప్పదని తెలిపింది.

ఈ మహమ్మారిని ఓ ఆయుధంగా చేసుకొని విధ్వంసం సృష్టించే ప్రయత్నాల్లో తీవ్రవాద సంస్థలు ఉన్నట్లుగా యుఎన్ ఐ సిఆర్ ఐ హెచ్చరికలు జారీ చేస్తోంది. జీవ బాంబులు గా తయారయ్యేందుకు ఆయా సంస్థల సభ్యులు కావాలని కరోనాను సోకేలా చేసుకుంటున్నారని, కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ అయిన తర్వాత వారు వివిధ ప్రదేశాలకు వెళ్ళి బహిరంగంగా తుమ్మడం, దగ్గటం వంటి చర్యలకు పాల్పడడం కోసం తీవ్రవాద సంస్థలు వారిని ప్రోత్సహిస్తున్నారని వెల్లడించింది.

ఉగ్రవాద సంస్థలు తమ నెట్ వర్క్ ను బలోపేతం చేయడం కోసం సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ కరోనా బాంబులుగా తయారు కావాలని సూచిస్తున్నట్లుగా అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. కరోనా బాంబులుగా తయారైన ఉగ్రవాదులు జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాలలో తుమ్మలతో , దగ్గులతో కరోనా వ్యాప్తి చేసే అవకాశం ఉన్నట్లుగా, తద్వారా మానవులకు హాని చెయ్యనున్నట్టు సమాచారం. ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకి ప్రజలు ఆందోళన లో ఉన్న సమయంలో ఉగ్రవాదులు కరోనా ను ఆయుధంగా మార్చుకోవడం తో ఆందోళన మరింతగా పెరిగిపోయింది.