Begin typing your search above and press return to search.

ఇంతకీ జీవోను ఎందుకు ఉపసంహరించుకున్నట్లు ?

By:  Tupaki Desk   |   26 Jun 2022 10:30 AM GMT
ఇంతకీ జీవోను ఎందుకు ఉపసంహరించుకున్నట్లు ?
X
జారీ చేసిన జీవోను తెలంగాణా ప్రభుత్వం గంటల వ్యవధిలోనే ఉపసంహరించుకుంది. ఉపాధ్యాయులంతా ఇకనుండి ప్రతి ఏడాది తమ ఆస్తుల వివరాలను కచ్చితంగా ప్రకటించాల్సిందే అని జీవో జారీచేసింది. అలాగే ఆస్తులు కొన్నా, అమ్మినా తమ ఉన్నతాధికారులకు చెప్పాలని, అనుమతి తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. మధ్యాహ్నం జారీ అయిన జీవోను రాత్రయ్యేసరికి ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.

మధ్యాహ్నం ఇచ్చిన జీవోను రాత్రయ్యేసరికి ఎందుకు ఉపసంహరించుకున్నట్లు ? అన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికే ఆదాయపు పన్ను స్టేట్మెంటును ప్రతి ప్రభుత్వ ఉద్యోగితో పాటు టీచర్లు కూడా సమర్పిస్తునే ఉన్నారు. అది నేరుగా ఆదాయపు పన్ను శాఖకు సమర్పిస్తారు. ఆస్తులను ప్రతి ఏడాది ప్రకటించాలని ఇప్పటికే నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం గట్టిగా అమలు చేయటంలేదు. అలాంటిది తాజాగా నిబంధనను కచ్చితంగా అమలు చేయించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది.

అయితే జీవోపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. టీచర్లలో పెద్ద నిరసనే మొదలైంది. ఎవరో కొంతమంది టీచర్లు ఏవో తప్పులు చేస్తే తామందరినీ ఇబ్బందులు పెట్టడం ఏమిటంటు టీచర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. దాంతో తెరవెనుక ఏమి జరిగిందో ఏమో కానీ గంటల వ్యవధిలోనే ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జీవోను కేసీయార్ విత్ డ్రా చేయమని ఆదేశించారట.

ఇప్పటికే వివిధ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కష్టమనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్న వర్గాలు సరిపోవన్నట్లు కొత్తగా టీచర్లను కూడా ఎందుకు వ్యతిరేకం చేసుకోవాలని కేసీయార్ ఆలోచించారట. ఆస్తులు ప్రకటించాలంటే, ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తీసుకోవాలని ఉత్తర్వులు ఇస్తే టీచర్లలో వ్యతిరేకత వస్తుందని అధికారపార్టీకి అంత మాత్రం తెలీదా ? ఇలాంటి విషయాలు ఏమీ ఆలోచించకుండానే ప్రభుత్వం జీవో ఇచ్చేసిందా ? అన్నదే ఆశ్చర్యంగా ఉంది.