Begin typing your search above and press return to search.

ఇక రాష్ట్రంలో తమిళ భాష తప్పనిసరి: స్టాలిన్ సర్కార్ ఉత్తర్వులు

By:  Tupaki Desk   |   5 Dec 2021 5:30 AM GMT
ఇక రాష్ట్రంలో తమిళ భాష తప్పనిసరి: స్టాలిన్ సర్కార్ ఉత్తర్వులు
X
ఒక రాష్ట్రానికి సీఎంగా స్టాలిన్ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఎవరూ ఊహించని ప్రత్యేక కార్యక్రమాలను ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలను పొందుతున్నాడు. దివంగత ముఖ్యమంత్రి జయలిత పథకాలను సైతం రద్దు చేయకుండా వాటిని కొనసాగించి ప్రతిపక్షాల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. ఇక తాజాగా సీఎం స్టాలిన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాష్ట్ర విద్యాలయాల్లో తమిళ భాష తప్పని చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే తమిళ భాష తెలిసి ఉండాలని చెప్పారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో తమిళ భాష ప్రవేశ పరీక్షను పాసైతేనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళుల్లో భాషాభిమానం ఎక్కువే ఉంటుంది. ఇటీవల జొమాటో విషయంలో తమిళ, హిందీ భాషపై జరిగిన వివాదంలో జొమాటో కంపెనీ అధినేత తమిళ భాషలో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. దీన్ని భట్టి ఇక్కడి ప్రజలకు ఎంత భాషాభిమానమో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడి వారు హిందీని జాతీయ భాషగా ఒప్పుకోమని అంటున్నారు. అంతేకాకుండా తమిళులను ఎవరైనా చిన్న చూపు చూస్తే సహించేది లేదని ఇక్కడి వారు అంటారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలను తమిళ భాషలోనే జరుపుతారు.

సీఎం పీఠంపై కూర్చున్న తరువాత స్టాలిన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. దివంగత జయలలిత ప్రవేశపెట్టిన పథకాలను కంటిన్యూ చేస్తున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లోని బాధితులకు 24 గంటలపాటు ఉచిత చికిత్స చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా వర్తిస్తుంది. మరోవైపు ఆకస్మికంగా ప్రభుత్వ కార్యాలయాలు సందర్శిస్తూ ఉద్యోగుల పనితీరుపై ఫోకస్ పెడుతున్నారు.

అభివృద్ధికి మొట్ట మొదటి ప్రాధాన్యం ఇస్తున్న డీఎంకే సర్కార్ తాజాగా భాషాకు సంబంధించిన ఈ నిర్ణయం తీసుకోవడంతో తమిళుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించే పోటీ పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు తమిళ పరీక్ష తప్పని సరి రాయాలని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి కనీసం 40 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి అన్నారు. అయితే తాజా విధానంతో సమాజిక న్యాయం ప్రబలేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రిక్రూట్ మెంట్ విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

ఇదే సమయంలో తమిళ పరీక్షలో ఫెయిల్ అయితే కష్టమేనని ఉత్తర్వులో పేర్కొన్నారు. మొత్తం పరీక్ష ప్లాన్ లో భాగమైన ఇతర సబ్జెక్ట్ పేపర్లు, ఆర్డర్ ప్రకారం మూల్యాంకనం తీసుకోబడుతాయని, ఇందులో తమిళ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలని తెలిపారు. టీచర్స్ రిక్రూట్ మెంట్, మెడికల్ బోర్డు, తమిళనాడు యూనిఫాండ్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ కమిటీతో సహా ఇతర రాష్ట్ర రిక్రూట్ మెంట్ ఏజెన్సీలు ఇవే మార్గదర్శకాలు విడుదల చేస్తాయని తెలిపారు.

తమిళ భాషపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ భాషకు ప్రాధాన్యం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మంది కి తొమ్మిది లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో భాషకు ఎనలేని గుర్తింపు వస్తుందని తెలిపారు. అయితే ప్రతీ రాష్ట్రం భాషపై ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తమ ఉనికి కోల్పోకుండా ఉంటారని ఆయన వివరించారు. కాగా తమిళనాడు సర్కార్ తమిళ భాషపై నిర్ణయం తీసుకోవడంపై ఇతర రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చ సాగుతోంది.