Begin typing your search above and press return to search.

బీసీల విషయంలో వ్యూహాత్మక నిర్ణయం!

By:  Tupaki Desk   |   24 Nov 2021 6:36 AM GMT
బీసీల విషయంలో వ్యూహాత్మక నిర్ణయం!
X
వెనకబడిన తరగతుల జనాభా విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం జనాభాలో బీసీల జనాభా ఎంతో కచ్చితమైన లెక్కలుండాలంటే బీసీల జనగణన జరగాల్సిందే అని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపారు. ప్రతి పదేళ్ళకు రెగ్యులర్ గా జరిగే జనాభా లెక్కల సమయంలోనే బీసీల జనాభా ఎంతో తేల్చాలంటూ సలహా కూడా ఇచ్చారు.

జనాభా లెక్కలు తీసేటపుడు ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకమైన కాలమ్ ఉన్నట్లే బీసీలకు కూడా ఓ కాలమ్ ఏర్పాటుచేస్తే సరిపోతుందని కూడా సూచించారు. కరోనా వైరస్ కారణంగా జనాభా లెక్కలు తీయటానికి ఇప్పటికే ఏడాది ఆలస్యమైందని కూడా జగన్ కేంద్రానికి గుర్తుచేశారు. కాబట్టి తొందరలోనే మొదలుపెట్టబోయే జనగణన ఫారమ్ లో బీసీల క్యాటగిరి అనే కాలమ్ ను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మిగిలిన దేశం సంగతిని వదిలేసినా రాష్ట్రంలో వరకు బీసీల ఓట్లపైనే వైసీపీ, టీడీపీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. తెలుగుదేశంపార్టీ ఏర్పాటైన దగ్గర నుండి బీసీలు గంపగుత్తగా మద్దతుగా నిలబడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే మొదటిసారిగా బీసీల్లో చీలిక వచ్చి 2019లో వైసీపీకి కూడా బీసీల్లోకి కొన్ని సామాజికవర్గాలు మద్దతుగా నిలిచాయి. దాంతో చరిత్రలోనే మొదటిసారిగా టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది.

వైసీపీని బీసీలు టోటల్ గా ఓన్ చేసుకునేట్లు చేయాలనే వ్యూహంలో జగన్ వాళ్ళకే ప్రతి విషయంలోను ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంఎల్సీ, ఎంపీలు, ఎంఎల్ఏ టికెట్లు కేటాయింపులతో పాటు ప్రత్యేకంగా బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్తు ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, ఎంపీపీ అధ్యక్ష పదవుల్లో కూడా బీసీలకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. రాజకీయ పదవుల విషయాన్ని పక్కనపెట్టేస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా బీసీలకే అధిక ప్రాధాన్యత దక్కుతోంది.

బీసీల విషయంలో జగన్ ఇంత చేస్తున్నా బీసీల జనాభా ఇంతాని కచ్చితమైన లెక్కలు లేవు. జనాభాలో అత్యధికులు బీసీలు అనే అంచనా మాత్రమే ఉంది. అందుకనే జనాభాలో బీసీల జనాభాపై కచ్చితమైన లెక్కలుండాలని జగన్ కోరుకుంటున్నారు. నిజానికి బీసీల జనాభాను లెక్కించాలని దశాబ్దాలుగా డిమాండ్లు వినబడుతునే ఉన్నాయి. అయినా ఎందుకనో కేంద్రం పెద్దగా దృష్టిపెట్టలేదు. ఇపుడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి ప్రకారం జనాభాలోనే బీసీల జనాభాను లెక్కించటానికి కేంద్రం సానుకూలమైతే జగన్ ప్రయత్నం ఫలించినట్లవుతుంది.