Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ కి చెక్‌ పెట్టే టాబ్లెట్ !

By:  Tupaki Desk   |   18 Jun 2021 4:30 PM GMT
కరోనా వైరస్ కి చెక్‌ పెట్టే టాబ్లెట్ !
X
ఒకరిలో కరోనా వైరస్ మహమ్మారి లక్షణాలు కనిపించాయి. కరోనా టెస్టులో పాజిటివ్‌ వచ్చింది. డాక్టర్‌ వద్దకు వెళ్లి చెప్పగానే యాంటీ వైరల్‌ మాత్రలు సిఫారసు చేశారు. అవి వాడగానే లక్షణాలు కొంచెం కొంచెం గా తగ్గిపోయాయి. ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితే రాలేదు. అమెరికాలోని ప్రముఖ వైద్యుడు ఆంధోనీ ఫౌచీ ఊహిస్తున్న భవిష్యత్తు ఇది. ఇది వట్టి ఊహ కాదు. ఈ ఊహను నిజం చేసే దిశగా అమెరికా 320 కోట్ల డాలర్లతో అంటే మన కరెన్సీ లో దాదాపు రూ.23 వేల కోట్లు ఒక ప్రాజెక్టును తలపెట్టింది. గత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాక్సిన్లతో వైర్‌సకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్‌ వార్ప్‌స్పీడ్‌ పేరుతో వ్యాక్సిన్‌ కంపెనీలకు భారీగా నిధులు ఇచ్చి అమెరికన్ల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ యాంటీ వైరల్‌ మందులపై పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు.

ఈ కార్యక్రమం గురించి అమెరికా ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న యాంటీవైరల్‌ ఔషధాలతో నిర్వహిస్తున్న ట్రయల్స్‌ను వేగవంతం చేయనున్నట్టు వెల్లడించింది. అంతా అనుకున్నట్టుగా జరిగితే.. ఈ ఏడాది చివరికే కరోనా ను నయం చేసే యాంటీ వైరల్‌ మందుబిళ్లలు అందుబాటులోకి వస్తాయి. పాత ఔషధాలతో క్లినికల్‌ ట్రయల్స్‌ తోపాటు.. భవిష్యత్తులో మహమ్మారులుగా పరిణమించే వైర్‌సలకు చెక్‌ పెట్టే కొత్త ఔషధాలను కనిపెట్టడానికి కూడా ‘ద యాంటీవైరల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ పాండెమిక్స్‌' సహకరిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్‌ ఫ్లూయెంజా, హెచ్‌ ఐవీ, హెపటైటిస్‌ సి వంటి వైరస్ లకు మాత్రలు అందుబాటులో ఉన్నాయి. కానీ, కరోనా మహమ్మారి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచిపోతున్నా దానికి అడ్డుకట్ట వేసే మాత్రలేవీ ఇంతవరకూ రాలేదు. కరోనా వచ్చిన కొత్తల్లో ఈ యాంటీ వైరల్‌ మందులను ఆస్పత్రిపాలైనవారికి ప్రయోగాత్మకంగా ఇచ్చి చూశారు.

వెనిజులియెన్‌ ఈక్వైన్‌ ఎన్‌ కెఫలైటిసిస్ వైర్‌స కు విరుగుడుగా.. 2019లో ఎమొరీ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన మోల్నుపిరవిర్‌ మాత్రలు కూడా తొలి దశలో కొంతవరకూ పనిచేస్తున్నాయని చెబుతున్నారు. ఆస్పత్రిపాలైనవారికి మాత్రం అవి పనిచేయట్లేదని ట్రయల్స్‌లో తేలింది. అప్పుడు శాస్త్రవేత్తలకు ఒక విషయం అర్థమైంది. కరోనా వైర్‌సను అడ్డుకోవాలంటే, అది వ్యక్తులకు సోకిన తొలినాళ్లలోనే, తనను తాను రెట్టింపు చేసుకునే సమయంలోనే యాంటీ వైరల్‌ మందులు ఇవ్వాలి తప్ప వైరల్‌ లోడ్‌ పెరిగిపోయి ఆస్పత్రిపాలైనవారికిస్తే ఏ ఉపయోగమూ లేదని వారికి తెలిసింది. అలాంటివాటిలో అటియా ఫార్మా అభివృద్ధి చేసిన ఏటీ-527 మందు బాగా పనిచేస్తోందని సమాచారం. హెపటైటిస్‌ సి పై ఈ మందు సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తున్నట్టు ఇప్పటికే పరీక్షల్లో తేలింది. అది కొవిడ్‌కు కూడా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో రోచె సంస్థ ఈ మందుపై హ్యూమన్‌ ట్రయల్స్‌ చేయడానికి అటియాతో జట్టు కట్టింది. అలాగే, ఫైజర్‌ కంపెనీ సార్స్‌ కోసం గతంలో తయారుచేసిన మరో మందులోని మాలిక్యూల్‌ పీఎఫ్ -07321332' ఆధారంగా రూపొందించిన ఔషధం ఎలుకలపై బాగా పనిచేస్తోందని తేలింది.