Begin typing your search above and press return to search.

బాండ్ల పెట్టుబడి వివాదంపై స్పందించిన టీటీడీ

By:  Tupaki Desk   |   17 Oct 2020 5:31 PM GMT
బాండ్ల పెట్టుబడి వివాదంపై స్పందించిన టీటీడీ
X
ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ప్రభుత్వానికి టీటీడీ అండగా నిలుస్తోందని.. ఈ మేరకు శ్రీవారి సొమ్మును బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయకుండా ప్రభుత్వానికే వడ్డీకి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించినట్టు ఈ ఉదయం నుంచి పలు మీడియాలు, వెబ్ సైట్లలో కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో టీటీడీ పెట్టుబడి పెడుతోందంటూ వివాదం చెలరేగింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శించాయి. శ్రీవారి నిధులను మళ్లించేందుకు ఈ ప్లాన్‌ చేస్తున్నారా అని ప్రశ్నించాయి.

ఈ వివాదంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. టీటీడీ నిధులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారనే ప్రచారం అవాస్తవమని టీటీడీ బోర్డు వెల్లడించింది. కేవలం బాండ్లను మాత్రమే తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదుకు మూడు శాతం వడ్డీ మాత్రమే వస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల కొనుగోలుతో ఏడు శాతం వడ్డీ వస్తోందని టీటీడీ బోర్డు తెలిపింది.

అన్నదాన, పక్షి, గో సంరక్షణ ట్రస్టులను టీటీడీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే వడ్డీ ఆదాయం పెంచేందుకే పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుందని టీటీడీ పేర్కొంది. రూల్ నంబర్ 80 ప్రకారం ఎక్కడైనా పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉందని.. 1990లో జారీ చేసిన జీవో 311లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని టీటీడీ బోర్డు తెలిపింది.