Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌ర్‌.. ఇది క్ష‌మించ‌రాని అంశం: రేవంత్ రెడ్డి బ‌హిరంగ లేఖ‌

By:  Tupaki Desk   |   22 May 2022 3:30 PM GMT
కేసీఆర్ స‌ర్‌.. ఇది క్ష‌మించ‌రాని అంశం:  రేవంత్ రెడ్డి బ‌హిరంగ లేఖ‌
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రొ.జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. అక్కంపేటలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా లేదన్నారు. అక్కంపేటకు రెవెన్యూ విలేజ్ హోదా ఇవ్వకపోవడం విచారకరమని విమర్శించారు. గ్రామంలో దళితుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని దుయ్యబట్టారు. దళిత బంధు పేరుతో ప్రభుత్వం గొప్పలు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. అర్హులైన దళితులను పథకం వర్తించడం లేదని రేవంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోం దని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లవుతున్నా... జయశంకర్ స్వగ్రామంలో అభివృద్ధి అనేది మచ్చుకైనా కానరావడంలేదన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు అక్కంపేట గ్రామాన్ని సందర్శించి ఊరు బాగుకోసం ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయని విమర్శించారు.

కనీస మౌలిక సదుపాయాలు కూడా అక్కంపేట గ్రామం నోచుకోకపోవడం దురదృష్టకరమని రేవంత్ అన్నారు. ఇప్పటికీ రెవెన్యూ విలేజ్‌ హోదా ఇవ్వకపోవడం అత్యంత విచారకరమని తెలిపారు. అక్కంపేట ఇప్పటికీ పెద్దాపూర్ గ్రామ పరిధిలోనే కొనసాగుతుం డటం క్షమించరాని అంశమని పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా అక్కంపేటలోని నిరుపేద దళితుడు చిలువేరు జానీ కుటుంబంతో కలిసి భోజనం చేశానని... చాలా దీనమైన పరిస్థితుల్లో కుటుంబం జీవనం సాగిస్తోందన్నారు. వారికి కనీసం సొంత ఇళ్లు సైతం లేదని తెలిపారు.

దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పితే వారి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తూ జయశంకర్ సార్ సొంత గ్రామంలో అభివృద్ధి లేదంటే పల్లె ప్రగతిలోని డొల్లతనం అర్ధమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే అక్కంపేటలో ప్రొఫెసర్ జయశంకర్ పేరిట స్మృతివనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.