Begin typing your search above and press return to search.

వైసీపీ గాలి : టీడీపీ నాలుగేళ్ళు ఆగాలి...?

By:  Tupaki Desk   |   13 May 2022 4:30 PM GMT
వైసీపీ గాలి :  టీడీపీ నాలుగేళ్ళు ఆగాలి...?
X
పెద్దల సభకు విశేష ప్రాధాన్యత ఉంది. లోక్ సభ ఎంపీ సభ్యత్వం అయిదేళ్ళకు ఉంటే ఇక్కడ ఆరేళ్ళు ఉంటుంది. పైగా ఇది శాశ్వత సభ. ఒక సారి ఎన్నిక కావాలి కానీ కచ్చితంగా ఆరేళ్ల పాటు సభలో ఉండవచ్చు. ఈ విషయంలో ఎలాంటి బ్రేకులూ ఉండవు. అందుకే రాజకీయ నాయకులు రాజ్యసభనే ఎక్కువగా కోరుకుంటారు. అందుకే డిమాండ్ ఎపుడూ మామూలుగా ఉండదు.

ఇదిలా ఉండగా విభజన ఏపీలో వైసీపీకి ఫుల్ మెజారిటీ ఉంది. అసెంబ్లీలో 151 సీట్లు ఉన్నాయి. అలాగే మరికొందరు ఎంపీల మద్దతు కూడా ఉంది. దాంతో సునాయాసంగా రాజ్యసభ ఎంపీ సీట్లను ఆ పార్టీ గెలుచుకుంటోంది. నోటిఫికేషన్ విడుదల కావడమే తరువాత విజేత ఎవరో తేలిపోతోంది.ఏపీలో నాలుగు రాజ్యసభ ఎంపీ సీట్లకు లేటెస్ట్ గా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 24న నోటిఫికేషన్‌ జారీ కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 31వ తేదీ గా నిర్ణయించారు. జూన్‌ 1న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్ 3వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఒక వేళ పోటీ లేకపోతే ఆ రోజునే విజేతలు ఎవరో తెలిసిపోతారు.

ఒకవేళ ఎవరైన పోటీ చేస్తే మాత్రం జూన్‌ 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఏపీ వరకూ చూస్తే టీడీపీకి 23 మాత్రమే ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇందులో నలుగురు టీడీపీ నుంచి వేరుగా ఉంటున్నారు. రాజ్యసభలో తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోవాలంటే 44 ఓట్లు అవసరం పడతాయి.

అందువల్ల టీడీపీకి ఇది అసాధ్యమైన విషయం. దాంతో ఈ నాలుగు సీట్లూ వైసీపీకే వస్తాయి. దాంతో ఈ ఎన్నికల తరువాత రాజ్యసభలో వైసీపీకి 9మంది ఎంపీలు వస్తాయి. ఇంతే కాదు, తొందరలోనే మరో కొత్త రికార్డుని కూడా వైసీపీ క్రియేట్ చేయబోతోంది. 2024లో మరో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

ఆ సీట్లలో ఒకటి వైసీపీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిది. ఆయన పదవీకాలంతో పాటు, బీజేపీకి చెందిన సీఎం రమేష్ పదవీకాలం 2024 ఏప్రిల్ 22తో పూర్తి అవుతుంది. ఇక టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్ పదవీకాలం కూడా అదే రోజుతో పూర్తి అవుతుంది.

ఇక ఈ మూడు ఖాళీల భర్తీకి గడువు ఉన్న దాని కంటే నెల రోజు ముందు నోటిఫికేషన్ ఇస్తారు. ఎన్నికలు కూడా ముందే జరుగుతాయి. అంటే 2024 మార్చిలో ఈ మూడు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజుకు కూడా శాసనసభలో వైసీపీదే బలం కాబట్టి కచ్చితంగా మూడు సీట్లను వైసీపీ గెలుచుకునే వీలుంటుంది. ఇక రాజ్యసభ మొత్తం సీట్లలో ఏపీ వాటా 11 సీట్లు. ఇలా 2024 నాటికి అన్ని సీట్లను వైసీపీ కైవశం చేసుకుంటే రాజ్యసభలో కొత్త రికార్డుని క్రియేట్ చేసినట్లే అవుతుంది. అదే సమయంలో టీడీపీకి జీరో నంబర్ వస్తుంది.

అయితే 2024 లో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి టీడీపీ అధికారంలోకి వచ్చినా లేక విపక్షంలో ఉన్నా ఇంతకంటే ఎక్కువ సీట్లే వస్తాయి కాబట్టి 2026 నాటికే ఆ పార్టీ తమ ఎంపీలను రాజ్యసభకు పంపగలుగుతుంది. ఈ లెక్కన చూసుకుంటే టీడీపీ పెద్దల సభలో అడుగుపెట్టాలీ అంటే ఈ రోజు నుంచి నాలుగేళ్ల పాటు ఎదురుచూడాలి అన్న మాట.