Begin typing your search above and press return to search.

మ‌హానాడు ఏర్పాట్లు.. మ‌హా.. మ‌హా.. అదిరిపోతున్నాయిగా!!

By:  Tupaki Desk   |   23 May 2022 3:46 PM GMT
మ‌హానాడు ఏర్పాట్లు.. మ‌హా.. మ‌హా.. అదిరిపోతున్నాయిగా!!
X
ఒంగోలు వేదికగా జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు `మ‌హా.. మ‌హా` అనే రేంజ్‌లో సాగుతున్నాయి. ఏకంగా 100 ఎక‌రాల్లో షెడ్లు వేస్తున్నారు. అదేస‌మ‌యంలో 25 వేల మందికి రెండు రోజుల పాటు భోజ‌నాలు, టిపిన్లు, కాఫీలు, మ‌జ్జిగ‌, కూల్ డ్రింకులు అందించేలా ప‌క్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు జరగనుండగా నగర శివారులో వంద ఎకరాల పొలాలను ఇందుకోసం అనువుగా తీర్చిదిద్దుతున్నారు. రెండేళ్లు కొవిడ్‌ కారణంగా మహానాడును వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించగా, ఈ దఫా బహిరంగ సభా ప్రాంగణం కావడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు టీడీపీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు పూర్తి కావడం, ఎన్టీఆర్‌ శత జయంతి వంటి ప్రాధాన్యత అంశాల నేపథ్యంలో మహానాడు నిర్వహణకు ఒంగోలు వేదిక అయింది. నగర సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో మహానాడు నిర్వహణకు అక్కడి రైతులు ముందుకు వచ్చారు. దాదాపు 100 ఎకరాల్లో ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. తొలిరోజు ప్రతినిధుల సభ, రెండవ రోజు బహిరంగ సభ ఒకే వేదికపై జరగనున్నాయి. అందుకు వీలుగా ప్రధాన వేదికను నిర్మిస్తున్నారు. ఎంపిక చేయబడిన ప్రతినిధులు సుమారు 10 వేల వరకు ఉండనుండగా, ప్రాంగణంలో 12వేల మంది కూర్చొనేలా జర్మన్‌ షెడ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.

మహానాడు ప్రాంగణానికి సమీపంలోనే 25 వేల మంది కార్య‌క‌ర్త‌లు, ప్రతినిధులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలలో నేతలు వచ్చే అవకాశం ఉండగా పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లకు ఈ నెల 18న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు భూమిపూజ చేసి ప్రారంభించగా ప్రతిరోజూ ముఖ్యమైన రాష్ట్రస్థాయి నాయకులు ఎవరో ఒకరు వచ్చి పరిశీలిస్తున్నారు. ఏర్పాట్లన్నీ ఈ నెల 25కు పూర్తి చేసేలా పనిచేస్తున్నట్లు నిర్వాహ‌కులు తెలిపారు.

తొలిసారి ఒంగోలులో మహానాడు జరగనుండటంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టీడీపీ కేడర్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఒకవైపు మహానాడు ప్రాంగణం వద్దకు వచ్చి ఏర్పాట్లు పరిశీలించి వెళ్తూనే, మరోవైపు బహిరంగ సభకు జన సమీకరణపై దృష్టి సారించారు. మూడు రోజుల క్రితమే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నియోజకవర్గ స్థాయి స‌మావేశం నిర్వహించి నేతలకు బాధ్యతలు అప్పగించారు. కొండపి ఎమ్మెల్యే స్వామి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ నేతృత్వంలో ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు.

మహానాడు నేపథ్యంలో ఆ రెండు రోజులు ఒంగోలులోని హోటళ్లు, లాడ్జీలు, ప్రైవేటు అతిథిగృహాల్లోని గదులతోపాటు కల్యాణ మండపాలు అన్నింటినీ టీడీపీ నేతల బస కోసం ఇప్పటికే బుక్‌ చేశారు. ఒంగోలు నగరంలో వసతులు పరిమితంగానే ఉండటంతో నెల్లూరు నుంచి విజయవాడ వరకు ఉండే పట్టణాల్లో బసకు చర్యలు తీసుకుంటున్నారు.