Begin typing your search above and press return to search.

వైఎస్‌ వివేకా మర్డర్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

By:  Tupaki Desk   |   29 Nov 2022 6:30 AM GMT
వైఎస్‌ వివేకా మర్డర్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
X
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణలోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని.. అందువల్ల ఈ కేసును ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా మరెక్కడైనా విచారించాలని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు పలుమార్లు ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పు వెలువరించింది. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టు పేర్కొంది. వైఎస్‌ వివేకా సతీమణి, ఆయన కుమార్తె ఇద్దరూ కేసు విచారణపై అసంతృప్తిగా ఉన్నందున.. వారి ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఆర్‌.షా తెలిపారు.

తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య సుప్రీంకోర్టు వరకూ రావడమంటే ఈ కేసులో ఎన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయో అర్థమవుతోందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

విచారణపై వాళ్లిద్దరూ అసంతృప్తిగా ఉన్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో వారి ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును బదిలీ చేస్తున్నామని వెల్లడించింది. హత్య కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు హాట్‌ కామెంట్స్‌ చేసింది. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.

ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్ర కోణం దాగి ఉందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్ష్యాలను ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ పరిణామాలన్నింటిలో ఉన్న కుట్ర కోణం బయటకు రావాలంటే తదుపరి విచారణ కొనసాగాల్సి ఉందన్నారు. కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో విచారణ జరగడం కంటే బయట రాష్ట్రంలో కొనసాగడమే సముచితమని భావిస్తున్నామని వెల్లడించింది. అందుకే కేసును హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నాం అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

మరోవైపు వివేకా హత్య కేసు విచారణకు స్థానిక యంత్రాంగం ఏమాత్రం సహకరించడం లేదని.. ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయని గతంలో సుప్రీంకోర్టులో సీబీఐ సైతం అఫిడివిట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు విచారణను హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.