Begin typing your search above and press return to search.

ఆదివార‌మే ఆత్మ‌కూరు ఫ‌లితం.. వైసీపీలో టెన్ష‌న్ టెన్ష‌న్

By:  Tupaki Desk   |   25 Jun 2022 1:37 PM GMT
ఆదివార‌మే ఆత్మ‌కూరు ఫ‌లితం.. వైసీపీలో టెన్ష‌న్ టెన్ష‌న్
X
నెల్లూరు జిల్లాలోని ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజక వర్గానికి జ‌రిగిన‌ ఉప ఎన్నికకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. దీంతో అధికార పార్టీ వైసీపీలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇక‌, లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు.

ఓట్లు లెక్కింపు ఏర్పాట్లు ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టడం జరిగిందన్నారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కౌంటింగు సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.

ఓట్లు లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి, పార్టీ ఏజెంట్లకు, పాసులు జారీ చేసిన‌ట్టు చెప్పారు. పాసులు వుంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామ‌న్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేశామ‌ని, 20 రౌండ్స్ లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుతో ఓట్లు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ప్రతి టేబుల్ కు ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్ ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొంటారని తెలిపారు.

కౌంటింగ్ చివర్లో ర్యాండ‌మ్‌గా ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీ ప్యాట్స్ ను ప్రత్యేకంగా లెక్కిస్తామ‌న్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మీడియా కవరేజ్ నిమిత్తం ప్రత్యేకంగా మీడియా రూమును కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది, పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ హాల్లోకి వెళ్లుటకు వేరువేరుగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్టమైన బందోబస్తు నడుమ జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.

వైసీపీలో టెన్ష‌న్ టెన్ష‌న్‌..

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో విజ‌యం మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డిదే అయిన‌ప్ప‌టికీ.. మెజారిటీపై వైసీపీ అధిష్టానం చాలానే ఆశ‌లు పెట్టుకుంది. జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు.. సంక్షేమంతో ఇక్క‌డ మెజారిటీ ల‌క్ష ఓట్లు దాటుతుంద‌ని.. దాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అయితే.. పోలింగ్ 64.5 శాతానికి ప‌రిమితం కావ‌డం, బ‌రిలో బీజేపీ స‌హా 13 మంది అభ్య‌ర్థులు ఉండ‌డం.. ఓట్ల చీలిక వంటిప‌రిణామాల‌తో.. మెజారిటీ త‌గ్గుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

దీంతో వైసీపీలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎందుకంటే.. త‌మ పాల‌న‌కు అంటే.. మూడేళ్ల పాల‌న త‌ర్వాత‌.. వ‌చ్చిన ఉప పోరుకావ‌డంతో ప్ర‌జ‌ల ఆశీర్వాదం త‌మ‌కు ఉంద‌ని చెప్పుకొనేందుకు ఈ ఉప పోరును ప్ర‌ధాన అస్త్రంగా భావించాల‌ని జ‌గ‌న్ అనుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే మెజారిటీపై టెన్ష‌న్ నెల‌కొంది. మ‌రి ప్ర‌జ‌ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.