Begin typing your search above and press return to search.

వైర‌స్ బాధితుల మృత‌దేహాలు అప్ప‌గించి చేతులు దులిపేసుకున్నారు

By:  Tupaki Desk   |   11 July 2020 11:30 AM GMT
వైర‌స్ బాధితుల మృత‌దేహాలు అప్ప‌గించి చేతులు దులిపేసుకున్నారు
X
రోజురోజుకు కేసులు పెరిగిపోవ‌డంతో వైద్యులు.. వైద్య సిబ్బంది.. ప్ర‌భుత్వ అధికారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వైర‌స్ బాధితుల‌పై నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. ఎంత‌మందిని కాపాడుకుంటాం.. ఎంత‌మంది ర‌క్షిస్తామ‌నే ధోర‌ణిలో ఉన్నారు. ఈక్ర‌మంలో వైర‌స్ బాధితుల మృత‌దేహాల‌పై తీవ్ర నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. వైర‌స్‌తో మృతిచెందిన వారి బాడీల‌ను గుట్టుచ‌ప్పుడు కాకుండా కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించి చేతులు దులిపేసుకుంటున్నారు. ఆ విధంగా తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌లో ఈ ప‌రిస్థితి ఉంది.

కూకట్‌పల్లిలో నివసిస్తున్న ఓ వ్య‌క్తికి మంగళవారం మధ్యాహ్నం ఛాతీనొప్పి వ‌చ్చింది. దీంతో స‌మీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే వైర‌స్‌ లక్షణాలు ఉన్నాయని అనుమానించారు. పరీక్షలు చేసిన గంటకే అతడు మృతిచెందాడు. గుండెపోటు లేదా మరేదైనా ఇతర అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటారని పేర్కొంటూ వైద్యులు మృత‌దేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మ స్వ‌గ్రామం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మంగళగిరి ప్రాంతానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. అయితే ఏపీలోకి అనుమ‌తి ఇవ్వ‌రేమోన‌నే భ‌యంతో స్వ‌గ్రామానికి తీసుకెళ్ల‌కుండానే బుధవారం మధ్యాహ్నం బోయిన్‌పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ విధంగానే ప్రైవేటు ఆస్పత్రులు వైర‌స్ అనుమానితుల మృతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులకు సమాచారం అందిస్తే సమస్యలు వ‌స్తాయ‌నే భావ‌న‌తో గుట్టుచప్పుడు కాకుండా వైర‌స్ మృతదేహాల‌ను కుటుంబ‌స‌భ్యుల‌కు అప్పగించేస్తున్నారు. వైర‌స్‌తో మృతిచెందిన విష‌యం తెలిస్తే జీహెచ్‌ఎంసీ, పోలీసు, వైద్య శాఖ, ఆ ఆస్పత్రి సిబ్బంది పర్యవేక్షణలో అంత్య‌క్రియ‌లు చేయాల్సి ఉంది. ఇవ‌న్నీ త‌ల‌నొప్పిగా భావించి వైర‌స్‌తో మృతిచెందినా కూడా అలాంటిదేమీ లేద‌ని చెప్పి మృత‌దేహాల‌ను కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గిస్తున్నారు. అయితే ఇది మొద‌టికే ప్ర‌మాదం. వైర‌స్ ఉన్నా మృత‌దేహం కుటుంబ‌స‌భ్యుల‌కు ఇస్తే వారికి వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉంది. ప్రైవేటు ఆస్పత్రులపై ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది.

గుండెనొప్పి.. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆస్పత్రికి వచ్చినా ముందుగా వైర‌స్ నిర్ధార‌ణ‌ పరీక్షలు చేయాలి. లక్షణాలు ఉంటే వారిని వైర‌స్ చికిత్స అందించే ఆస్పత్రికి తరలించాలి. అయితే అంత‌కుముందే చనిపోతే నమునాలు సేకరించి వైర‌స్ విష‌యం నిర్ధారించాకే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలి. ఈ విధంగా ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఉండ‌గా ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎవరైనా చనిపోతే వారిని గుండెనొప్పితో మృతిచెందాడ‌ని మృతదేహాల‌ను అప్పగిస్తున్న కేసులు హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్నాయి. కుటుంబసభ్యులు కూడా వైర‌స్‌తో మృతిచెంద‌లేద‌ని భావించి సంతోషం వ్య‌క్తం చేసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ విధంగా ఇప్పుడు ప్రైవేటు ఆస్ప‌త్రుల నిర్ల‌క్ష్యం వైర‌స్ బాధితుల మృత‌దేహాలకు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ప్ర‌భుత్వం స్పందించి ప్రైవేటు ఆస్ప‌త్రుల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ పెడితే కొంత ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.