Begin typing your search above and press return to search.

చిత్తూరు వైసీపీ అగ్రనేతల మధ్య సైలెంట్ వార్

By:  Tupaki Desk   |   25 Oct 2021 5:23 AM GMT
చిత్తూరు వైసీపీ అగ్రనేతల మధ్య సైలెంట్ వార్
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్నింటికి మించి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలకు కాలమే వేదిక. కలలో కూడా ఊహించని కాంబినేషన్లకు కారణంగా మారుతుంటుంది. అంతే కాదు కాలం తీసుకొచ్చే మార్పులతో అప్పటివరకు స్నేహితులుగా ఉంటూ ఆత్మీయ ఆలింగనాలు చేసుకునే నేతలు సైతం.. మారిన పరిస్థితుల్లో కడుపులో కత్తులు ఉంచుకోవటం ఒకటైతే.. నేరుగానే తలపడటం మరికొన్ని సందర్భాల్లో చోటు చేసుకుంటూ ఉంటుంది. తాజాగా చిత్తూరు అధికారపక్షమైన వైసీపీలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఉందన్న మాట వినిపిస్తోంది.

చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పుంగనూరు ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. రాజకీయంగా చూస్తే.. ఈ ఇద్దరు నేతలు సీనియర్లు మాత్రమే కాదు ఒకరికొకరు మంచి స్నేహితులు కూడా. తమ ఉమ్మడి ప్రత్యర్థి అయిన చంద్రబాబుకు దిమ్మ తిరిగేలా చేయటంలో ఇద్దరు కలిసి కట్టుగా పని చేశారు. జిల్లాలో టీడీపీని దెబ్బ తీయటంలో వీరిద్దరి పాత్రను తక్కువ చేసి చూపలేం. వీరిద్దరి ఉమ్మడి ప్రయత్నాలతోనే కుప్పంలో వైసీపీ జెండా ఎగిరేలా చేశారని చెబుతారు.

మొన్నటివరకు లక్క బంగారంలా ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య ఇటీవల విబేదాలు పొడచూపినట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఫలితాలు వెల్లడైన మండల పరిషత్ ఎన్నికల తర్వాత నుంచి తేడా వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కుప్పంలో ఎంపీ రడ్డప్ప దూకుడు ఎక్కువగా ఉండటంతోపాటు..నియోజకవర్గం మొత్తం ఆయన అధీనంలో ఉందన్న భావన కలిగేలా ఆయన ఫ్లెక్సీల హడావుడి ఉంది. దీనిపై మంత్రి పెద్దరెడ్డి గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇలా మొదలైన దూరం అంతకంతకు ఎక్కువ అవుతోందన్న మాట వినిపిస్తోంది. మంత్రిగా పెద్దిరెడ్డికి ఇటీవల కాలంలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని.. అధధిష్ఠానం తమకు రెడ్ కార్పెట్ వేసిందని రెడ్డప్ప వర్గీయులు చెప్పుకోవటం.. అవన్నీ పెద్దిరెడ్డి చెవిన పడటం ఇప్పుడు వారి మధ్య దూరం మరింత పెరిగేలా చేసిందంటున్నారు.

ఇటీవల కాలంలో అంతకంతకూ విస్తరించుకుంటూ రెడ్డప్ప పోవటాన్ని పెద్దిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఇలా.. ఇరువురు అగ్రనేతల మధ్య పెరిగిన దూరం పార్టీ మీద ప్రభావం చూపేలా చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొన్నటివరకు ఇరువురు నేతలు కనిపించినంతనే కౌగించుకునేంత సన్నిహితంగా ఉండేవారని.. ఇప్పుడేమో అందుకు భిన్నంగా కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్న వైనం.. పార్టీకి నష్టం చేసేలా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.