Begin typing your search above and press return to search.

కడప జిల్లాలో అంత కిరాతకమా? వాడ్ని అస్సలు విడిచిపెట్టొద్దు

By:  Tupaki Desk   |   19 Jun 2021 3:07 AM GMT
కడప జిల్లాలో అంత కిరాతకమా? వాడ్ని అస్సలు విడిచిపెట్టొద్దు
X
పాడు ప్రేమ మరో ప్రాణాన్ని తీసింది. ప్రేమ పేరుతో ఉన్మాదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తాము ప్రేమించిన అమ్మాయి.. తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రేమించేయాలని.. తాము కోరినట్లుగా వ్యవహరించాలన్న ధోరణితో ఇప్పటికే పలువురు అమాయక అమ్మాయిల ప్రాణాలు పోయాయి. తాజాగా అలాంటి దారుణ ఘటన ఏపీలోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.

జిల్లాకు చెందిన బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య.. సుబ్బమ్మకు పద్దెనిమిదేళ్ల కుమార్తె శిరీష ఉంది. బద్వేల్ వీరారెడ్డి కాలేజీ డిగ్రీ సెకండ్ ఇయర్ చదవుతోంది. కొంతకాలంగా చరణ్ అనే యువకుడు ప్రేమిస్తున్నట్లుగా చెబుతూ వెంటపడుతున్నాడు. ఆమె అందుకు అంగీకరించలేదు.

కరోనా నేపథ్యంలో కాలేజీలు మూసి వేయటంతో శిరీష ఇంటి వద్దే ఉంటోంది. దీంతో శిరీష ను కలిసేందుకు వారి గ్రామానికి వెళ్లాడు చరణ్. ఆమెను బలవంతం చేశాడు. ఆమె నో చెప్పేయటంతో సహించలేని అతడు.. ఉన్మాదంతో శిరీష గొంతు కోశాడు. దీంతో విలవిలలాడిపోయిన శిరీష అక్కడికక్కడే ప్రాణాల్ని విడిచింది. ఈ దారుణాన్ని చూసిన అక్కడి వారు చరణ్ ను పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు.

అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల చేతిలో దెబ్బలు తిన్న చరణ్ స్పృహ కోల్పోయాడు. అతన్ని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఉదంతంతో గ్రామస్తుల తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిందితుడిపై తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కిరాతకుడ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.