Begin typing your search above and press return to search.

షాకింగ్ః ఈఎంఐ చెల్లించ‌క‌పోతే.. ఏం చేస్తున్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   14 Jun 2021 9:30 AM GMT
షాకింగ్ః  ఈఎంఐ చెల్లించ‌క‌పోతే.. ఏం చేస్తున్నారో తెలుసా?
X
ఇది ఈఎంఐల కాలం. ఓ వైపు అవ‌స‌రం వేధిస్తూ ఉంటుంది. మ‌రోవైపు బ‌డ్జెట్ మాత్రం ‘‘సారీ.. బాస్’’ అంటుంది. ఇలాంటి స‌మ‌యంలోనే ‘‘క‌మాన్ బాస్.. మై హూనా..’’ అంటూ ఆఫ‌ర్ ఇస్తుంటాయి మైక్రో ఫైనాన్స్ సంస్థ‌లు. ఈ విధంగా చాలా మంది చేతిలో డ‌బ్బులు లేకున్నా.. నెల నెలా ఇన్ స్టాల్ మెంట్ చెల్లిద్దామ‌ని ఫైనాన్స్ తీసుకొని వ‌స్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఈ విధంగా ఫోన్లు కూడా కొనుగోలు చేస్తున్నారు చాలా మంది. ఇలాంటి వారి రిమోట్ ను త‌మ చేతిలో పెట్టుకొని వేధిస్తున్నాయి ఆయా సంస్థ‌లు!

హైద‌రాబాద్ కు చెందిన ఓ యువ‌కుడు మంచి ఆండ్రాయిడ్‌ ఫోన్ కొనుక్కోవాల్సిన ప‌రిస్థితి. త‌ను చేస్తున్న ప‌నికోసం అత్య‌వ‌స‌రం. చేతిలో డ‌బ్బుల్లేవు. దీంతో.. మైక్రో ఫైనాన్స్ కంపెనీ ద్వారా నెల నెలా కిస్తీ చెల్లించేలా ఫోన్ తీసుకున్నాడు. ఈ నెల ఇన్ స్టాల్ మెంట్ చెల్లించ‌లేదు. గ‌డువు దాటిన నిమిషాల్లోనే ఫోన్ ఆగిపోయింది! ఏం జ‌రిగిందో అర్థం కాలేదు. ఎంత ప్ర‌య‌త్నించినా.. ఫోన్ ప‌నిచేయ‌ట్లేదు. కాసేప‌టికి ఓ మెసేజ్ ప్ర‌త్య‌క్ష‌మైంది. ‘‘మీరు ఈఎంఐ చెల్లించ‌ని కార‌ణంగా మీ ఫోన్ లాక్ చేయ‌బ‌డింది. వెంట‌నే డ‌బ్బులు చెల్లించి లాక్ ఓపెన్ చేయించుకోండి’’ అని అందులో ఉంది.

తప్పని పరిస్థితుల్లో.. ఓ షాపునకు వెళ్లి అక్కడ డబ్బులు ఇచ్చి, ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేశాడు. కానీ.. ఫోన్ తిరిగి ఓపెన్ కావ‌డానికి ఏకం ఆ మూడు రోజులు ప‌ట్టింది! ఈ మూడు రోజుల త‌న ప‌నులు మొత్తం ఆగిపోయాయని బాధితుడు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇది ఈ ఒక్క‌డి ప‌రిస్థితి మాత్ర‌మే కాదు. ఇలా ఇన్ స్టాల్ మెంట్ ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేసిన వారంద‌రిదీ. ఉన్న‌ట్టుండి ఫోన్ లాక్ చేసేస్తుండ‌డంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థ‌లు చేసిన ఆగ‌డాలు గ‌తంలో చాలానే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. డ‌బ్బు రుచి మ‌రిగిన సంస్థ‌లు.. రూపం మార్చుకొని మ‌ళ్లీ జ‌నాళ్లోకి వ‌చ్చేశాయి. ఇందులో ఒక రూప‌మే మొబైల్ సేల్స్ ద‌గ్గ‌ర ఉంటోంది. ప్ర‌ధాన సెల్ ఫోన్ షాపులతో వీళ్లు ముందుగానే ట‌య్య‌ప్ అవుతున్నారు. అక్క‌డికి ఎవ‌రైనా ఫోన్ కొన‌డానికి వ‌స్తే.. వారు చెప్పిన బ‌డ్జెట్ క‌న్నా ఎక్కువ ధ‌ర క‌లిగిన ఫోన్లు చూపిస్తారు. మంచి ఫీచ‌ర్లు ఉన్నాయ‌ని, అద్భుతం అంటూ టెంప్ట్ చేస్తారు. డ‌బ్బులు స‌రిప‌డా లేవ‌న‌గానే.. మైక్రో ఫైనాన్స్ సంస్థ సిబ్బంది ప్ర‌త్య‌క్షం అవుతాడు. సింపుల్ ఈఎంఐ లో రుణం ఇస్తాన‌ని చెప్తాడు. అత‌డి ప‌ని మాట‌లు చెప్ప‌డ‌మే కాబ‌ట్టి.. ఈజీగా తెగ్గొట్టేస్తాడు.

ఓకే చెప్పించుకున్న త‌ర్వాత పేప‌ర్ల‌పై సంత‌కాలు తీసుకుంటాడు. అందులో ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ తరహాలో.. ఎక్కడో మూలన డ‌బ్బులు స‌మ‌యానికి క‌ట్ట‌క‌పోతే ఫోన్ లాక్ ప‌డుతుంద‌ని రాసి ఉంటుంది. అది కూడా ఇంగ్లీషులో! ఇంక చెప్పాల్సింది ఏముంటుందీ? మిగిలిన భాగం ఈఎంఐ క‌ట్ట‌క‌పోతే చూడాల్సిందే. ఇలా ఎంతో మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే.. ఇది ఖ‌చ్చితంగా నేర‌మేన‌ని అంటున్నారు నిపుణులు. ఎక్క‌డో ఉండి వినియోగ‌దారుడి ఫోన్ ను నియంత్రిస్తున్నారంటే.. ఇంకా ఏమైనా చేయ‌గ‌ల‌రు క‌దా? అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఫోన్లో ఉన్న స‌మాచారం కూడా సేక‌రించ‌ర‌ని గ్యారంటీ ఏంటీ? అనే ప్ర‌శ్న వ‌స్తోంది. ఇలాంటి సంస్థ‌ల‌పై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్ వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో.. జ‌నం కూడా ఇలాంటి సంస్థ‌ల విష‌యంలో ఆచితూచి నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంద‌ని సూచిస్తున్నారు నిపుణులు.