Begin typing your search above and press return to search.

మూడేళ్ల తర్వాత మళ్లీ షాక్.. రూ.2వేల నోటు రద్దు చేయాలన్నారు

By:  Tupaki Desk   |   8 Nov 2019 4:20 PM GMT
మూడేళ్ల తర్వాత మళ్లీ షాక్.. రూ.2వేల నోటు రద్దు చేయాలన్నారు
X
ఇవాల్టి రోజు ప్రత్యేకత గుర్తుందా? మూడేళ్ల క్రితం ఇదే రోజు(నవంబరు 8) రాత్రి తొమ్మిదిన్నర.. పది గంటల వేళలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. సరిగ్గా ఇదే రోజున ఆర్థిక శాఖ మాజీ కార్య దర్శి ఎస్ సి గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రూ.2వేల నోటు కు సంబంధించిన పలు అనుమానాలు.. అంచనాలు.. ఆందోళనలు రేపుతున్న వేళ రూ.2వేల నోట ఎప్పుడైనా నిషేధించొచ్చన్న మాట అంతకంతకూ బలపడుతోంది. ఇలాంటివేళ.. అత్యున్నత స్థానం లో పని చేసిన సీనియర్ అధికారి గార్గ్..రూ.2వేల నోటు ను రద్దు చేయాలని తేల్చేయటం ఇప్పుడు సంచనలంగా మారింది.

రూ.2వేల నోటును రద్దు చేయటం కారణంగా ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఆయన పెద్ద నోట్లను రద్దు చేసిన సమయం లో చెలామణీ లోకి తెచ్చిన కొత్త నోటును రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థ లో నగదు చెలామణీ భారీగా ఉందన్న గార్గ్.. రూ.2వేల నోట్లను పెద్ద ఎత్తున దాస్తున్నట్లుగా ఆధారాలు భారీగా ఉన్నాయన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న వేళ.. భారత్ లో మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోందన్నారు. ప్రస్తుతం చెలామణి లో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2వేల నోట్లు ఉన్నాయని.. అయినప్పటికీ చాలా వరకూ ఈ నోట్లు బయటకు రావటం లేదన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో నగదు లావా దేవీలకు పూర్తిగా గుడ్ బై చెప్పాలన్న ఆయన.. చైనా లో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక రంగంలోని కీలక స్థానం లో పని చేసిన గార్గ్ లాంటి పెద్దాయన రూ.2వేల నోటు గురించి ఇంత సంచలన వ్యాఖ్యలు ఏ పరిణామాలకు దారి తీస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.