Begin typing your search above and press return to search.

టీడీపీలో శనివారం టెన్షన్!

By:  Tupaki Desk   |   14 Jun 2021 4:42 AM GMT
టీడీపీలో శనివారం టెన్షన్!
X
శనివారం వస్తోందంటే తెలుగుదేశంపార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందా ? ఆక్రమణల తొలగింపు విషయంలో టీడీపీ నేతల రియాక్షన్ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. శనివారం వస్తోందంటే ఎవరి నిర్మాణాలను ప్రభుత్వం కూల్చేస్తుందో అర్ధంకాక నానా అవస్తలు పడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జేసీబీలు, బుల్డోజర్ల, ప్రొక్లైనర్లను పట్టుకొచ్చి అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారంటే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భోరు మంటున్నారు.

ఇప్పటివరకు టీడీపీ నేతలకు చెందిన గీతం విశ్వవిద్యాలయం, ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాస్, సబ్బంహరి తదితరులకు చెందిన నిర్మాణాలను ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి తర్వాతే కూల్చివేతలకు దిగింది. గడచిన రెండు రోజులుగా పల్లా శ్రీనవాసరావు సోదరుడు పల్లా శంకర్రావుకు చెందిన నివాసాలు కూల్చేయటంతో శనివారం టెన్షన్ బాగా పెరిగిపోయింది.

ఇదే సందర్భంగా ప్రభుత్వం మాత్రం తాము టీడీపీ నేతలు ఆక్రమించి నిర్మించుకున్న కట్టడాలను మాత్రమే తొలగిస్తున్నట్లు చెబుతోంది. అధికారంలో ఉన్నపుడు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించేసి అనుమతులు లేకుండానే నిర్మాణాలను చేసుకున్నట్లు రెవిన్యు అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. తమ భూములను తాము వెనక్కు తీసుకోవటంలో భాగంగానే ఆక్రమనిర్మాణాలను కూల్చేయటంలో తప్పే లేదని రెవిన్యు అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే తమ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చేస్తోందని చెబుతున్న టీడీపీ నేతలు తమ నిర్మాణాలన్నీ సక్రమమే అని మాత్రం చెప్పటంలేదు. ఎంతసేపు నిర్మాణాలను కూల్చేస్తోందని మాత్రమే ఆరోపిస్తున్నారు. నిర్మాణాలున్న భూమి తమదే అని నిరూపించుకోలేకపోతున్నారు. గీతంవిశ్వవిద్యాలయం ఇదే విషయమై కోర్టుకెళ్ళినపుడు సదరు భూమి ప్రభుత్వానిదే అని తేలిపోయింది.

ఆక్రమణలదారులకు కూడా బాగా తెలుసు తాము ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేసుకున్నట్లు. కాకపోతే ఏదో ఓ గోల చేయాలి కాబట్టి నిర్మాణాలను కూల్చేస్తన్నారంటు గోల చేస్తున్నారు. సబ్బంహరి విషయంలో కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు కోర్టులో తేలింది. కోర్టుకు వెళితే ఉపయోగం ఉండదని తెలిసే జనాల సానుభూతి కోసం కొందరు నేతలు మీడియాలో నానా గోల చేస్తున్నట్లు అర్ధమైపోతోంది.