Begin typing your search above and press return to search.

కుట్లు ఊడిపోతున్న.. రక్తం కారుతున్న.. పోరాటం ఆపలే !

By:  Tupaki Desk   |   2 Aug 2021 6:34 AM GMT
కుట్లు ఊడిపోతున్న.. రక్తం కారుతున్న.. పోరాటం ఆపలే !
X
మనకి ఏదైనా గాయం తగిలి ,ఒకటి రెండు కుట్లు వేస్తేనే వారం పాటు బెడ్ కి మాత్రమే పరిమితం అవుతాం. అయితే , మొఖం పై ఏకంగా 13 కుట్లు ఉన్న సమయంలో ఎవరైనా బాక్సింగ్ చేస్తారా అంటే , ఖచ్చితంగా బాక్సింగ్ చేయరు అని చెప్తాం. కానీ, భారత బాక్సర్‌ సతీశ్‌ బాక్సింగ్‌ బరిలో దిగాడు. ప్రత్యర్థి పంచ్‌ లకు తన ముఖానికి పడిన కుట్లు ఎంతగా బాధిస్తున్నా చివరి వరకు విజయం కోసం , భారత్ కి మరో పథకం అందించాలనే లక్ష్యం తో పోరాడాడు ఈ ఇండియన్ ఆర్మీ మ్యాన్.. చివరకు ఫలితం ఓటమి అయినా...తన ప్రదర్శన తో అందరి మనసులు గెలిచాడు. ఈ ఆర్మీ బాక్సర్‌ తన ఆర్మీ నైజాన్ని చాటాడు. యుద్ధభూమిలో బుల్లెట్లు దిగినా ఊపిరి ఉన్నంతవరకు పోరాడే తత్వాన్ని టోక్యో ఒలింపిక్స్‌ లో చూపాడు. చివరి వరకు ఓటమిని ఒప్పుకొని ఇండియన్ ఆర్మీ నైజాన్ని మరోసారి నిజం చేసాడు.

సతీశ్‌ అద్భుత పోరాటంతో టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల బాక్సింగ్‌ లో భారత్‌ పోరాటం ముగిసింది. 91+కేజీ విభాగం సూపర్‌ హెవీవెయిట్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ లో సతీశ్‌ కుమార్‌ 0-5తో వరల్డ్‌ చాంపియన్‌ జలోలోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓటమిపాలైయ్యాడు. కానీ ఈ బౌట్‌ లో అతడు ఏ పరిస్థితుల్లో బరిలోకి దిగాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. గురువారం రికార్డో బ్రౌన్‌ (జమైకా)తో జరిగిన ప్రీక్వార్టర్స్‌ లో సతీశ్‌ నుదుటి భాగం, గడ్డంపై తగిలిన దెబ్బలకు 13 కుట్లు వేశారు. అవి తగ్గక మునుపే సతీశ్‌ క్వార్టర్స్‌ ఆడేందుకు రింగ్ లోకి దిగాడు. ఈ బౌట్‌ లో ప్రత్యర్థి పంచ్‌ లకు కుట్లు తెరుచుకుని రక్తం కారుతున్నా, తుది వరకు పోరాడాడు. అతని పోరాటం చూసి , గేమ్ ముగిసిన తర్వాత, విజేత జలోలోవ్‌ సైతం సతీశ్‌ ధైర్యాన్ని ప్రశంసించాడు.

గత ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా అతని కంటిపై భాగానికి , గవదకు గాయాలయ్యాయి. దీనితో ఆ రెండు చోట్ల కుట్లు వేయాల్సి వచ్చింది. ఇంతటి కఠిన పరిస్థితుల్లో బరిలోకి దిగే సాహసం చేసిన 32 ఏళ్ల సతీశ్‌ 0–5తో బఖోదిర్‌ చేతిలో ఓడిపోయాడు. గాయపడిన విషయం తెలియగానే సతీశ్‌ భార్య, తండ్రి ప్రిక్వార్టర్స్‌ విజయం దగ్గరే ఆగిపోమన్నారు. క్వార్టర్స్‌ బరిలో దిగొద్దని పదేపదే చెప్పుకొచ్చారు. అయినాసరే ఇవేవి లెక్కచేయకుండా దేశం కోసం అతను ప్రాతినిధ్యం వహించిన తీరు అసమాన్యం. కాగా, పతకాల ఆశలెన్నో పెట్టుకున్న బాక్సింగ్‌ లో భారత్‌కు ఒకే ఒక్క పతకం ఖాయమైంది. మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్‌ (69 కేజీలు) సెమీస్‌ చేరింది. మిగిలిన వారంతా సతీశ్‌ కంటే ముందే ఇంటిదారి పట్టేశారు.