Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.800 కోట్లు హుష్ కాకేనా?!

By:  Tupaki Desk   |   29 Jun 2022 5:36 AM GMT
ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.800 కోట్లు హుష్ కాకేనా?!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వ ఉద్యోగుల డీఏ బ‌కాయిలు 800 కోట్ల రూపాయ‌ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెనక్కి తీసుకుందా అంటే అవుననే ప‌లు ఆంగ్ల‌, తెలుగు దిన‌ప‌త్రిక‌లు పేర్కొంటున్నాయి. ఈ మేర‌కు ప్ర‌ముఖంగా అవి వార్త‌లు ప్ర‌చురించాయి. సుమారు 90 వేల మంది ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు చెందిన రూ.800 కోట్ల జీపీఎఫ్‌ నిధులు మాయమైపోయాయ‌ని అవి పేర్కొన్నాయి.

ఉద్యోగులకు తెలియకుండా, వారి సమ్మతి లేకుండానే ప్రభుత్వం 800 కోట్ల రూపాయ‌ల సొమ్మును లాగేసుకుందని చెబుతున్నాయి. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం జీపీఎఫ్‌ నుంచి అడ్వాన్సు ఇప్పించాలని ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండగా.. ఇప్పుడు వారి ఖాతాలను ఖాళీ చేయడం ఉద్యోగుల్లో కలకలం సృష్టిస్తోంద‌ని పేర్కొంటున్నాయి.

అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం(ఏజీ) గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగుల జీపీఎఫ్‌ వార్షిక స్టేట్‌మెంట్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింద‌ని.. ఆ లావాదేవీలను చూసుకున్న ఉద్యోగులకు అసలు సంగతి తెలిసింద‌ని అంటున్నారు. తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండానే సొమ్ము డెబిట్‌ అయినట్లు తేలింద‌ని చెబుతున్నారు.

డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో జూలై 2018, జనవరి 2019 డీఏ బకాయిలను ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలానికి వారికి తెలియకుండానే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంద‌ని ప్ర‌ధాన మీడియా పేర్కొంటోంది. తమ ఖాతాల్లో డబ్బులు విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌లు రావడంతో ఈ విషయాన్ని ఉద్యోగులు, సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లార‌ని అంటున్నారు. దీంతో మళ్లీ ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేసిందని చెబుతున్నారు.

తాజాగా జూన్ 27న సోమవారం అకౌంట్‌టెంట్‌ జనరల్ (ఏజీ) తమ వెబ్‌సైట్‌లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీపీఎఫ్‌ ఖాతాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన స్లిప్పులు అందుబాటులో ఉంచింద‌ని అంటున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు వెబ్ సైట్ లోకి వెళ్లి వివ‌రాలు చూసుకుని షాక్ తిన్నార‌ని చెబుతున్నారు. డీఏ బకాయిల రూపంలో తమ ఖాతాల్లో జమ అయిన జీపీఎఫ్‌ సొమ్ము మళ్లీ మాయమైనట్లు గుర్తించార‌ని స‌మాచారం. మార్చి నెలలోనే ఉద్యోగుల ఖాతాల నుంచి జీపీఎఫ్‌ సొమ్ము ఉపసంహరించినట్లు స్టేట్‌మెంట్‌లో కనిపిస్తోంద‌ని చెబుతున్నారు.

ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు డీఏ ఎరియర్స్‌ బకాయిలు చెల్లించినట్లే చెల్లించి తమకు తెలియకుండానే ఖాతాల్లో సొమ్ము మాయం చేసింద‌ని ఉద్యోగులు మండిప‌డుతున్నార‌ని తెలుస్తోంది. మార్చి నెలలోనే ప్ర‌భుత్వం 800 కోట్ల రూపాయ‌ల‌ను మాయం చేస్తే ప్రభుత్వం ఎందుకు తెలియజేయలేదని నిలదీస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ జీపీఎఫ్‌ ఖాతా నుంచి కూడా 83 వేలు విత్‌డ్రా అయ్యాయ‌ని అంటున్నారు. ఇదే అంశంపై ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఆర్థిక శాఖ అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని ఆయన జూన్ 28న సచివాలయానికి వచ్చారు. కానీ... ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగార‌ని స‌మాచారం.