Begin typing your search above and press return to search.

పెరుగుతున్న బీపీ రోగులు.. ఏ వయసు వారిలో ఎక్కువో తెలుసా?

By:  Tupaki Desk   |   17 May 2022 8:31 AM GMT
పెరుగుతున్న బీపీ రోగులు.. ఏ వయసు వారిలో ఎక్కువో తెలుసా?
X
ఈ మధ్య చాలా మందికి బీపీ వస్తుంది. అయితే హైబీపీ అనేది చాలా ప్రమాదకరమైనది. అయితే చాలా మందికి బీపీ ఉన్న సంగతి తెలియనే తెలియదు. ఒకవేళ తెలిసినా లైట్ తీసుకుంటారు. కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం. కొంత మందిలో బీపీ అనేది వంశపారంపర్యంగా వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు, తాత, ముత్తాతలు బీపీ ఉండే ఆ తర్వాతి తరం వాళ్లకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్న తల్లిదండ్రుల ద్వారా తమ బిడ్డలకు జన్యువు సంక్రమించే అవకాశం ఉంది.

దీంతో వాళ్లకు ఏదో ఒకరోజు హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ధూమపానం లేదా అనారోగ్యకరమైన ఆహారం వంటి అధిక రక్తపోటు ప్రమాద కారకాలతో కూడిన కుటుంబ జీవన శైలి వల్ల కూడా జన్యుపరమైన రక్తపోటు ఏర్పడవచ్చు.

రక్తపోటు అనేది మీ గుండె ధమనుల లోపలి గోడలపై అధిక వేగంతో రక్తాన్ని ప్రసరించే శక్తి. దీన్ని ఎంఎంహెచ్ జీలలో కొలుస్తారు. బ్లడ్ ప్రెషర్ ను స్పిగ్మోమానోమీటర్ ద్వారా లెక్కిస్తారు. హృదయ సంకోచం అంటే గుండె కొట్టుకున్నప్పుడు రక్తనాళాల్లో ఉండే పీడనం, హృదయ వ్యాకోచం అంటే గుండె విశ్రాంతి లో ఉన్నప్పుడు రక్త నాళాల్లో ఉండే పీడనం.

దీన్ని ఎంఎంహెచ్ జీ లో కొలిచి హృదయ సంకోచం లేదా హృదయ వ్యాకోచం గా సూచిస్తారు. పై సంఖ్య ఎక్కువగా, కింది సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వారిలో రక్తపోటు 120/80గా ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల బీపీ ఎక్కువ కావడం లేదా తక్కువ అవడం జరుగుతుంది.

రెండింటిలో ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్రకారం హృదయ సంకోచం 160 ఎంఎంహెచ్ జీ అధికంగా ఉండి, హృదయ వ్యాకోచం 95 ఎంఎంహెచ్ జీ కంటే అధికంగా ఉన్నప్పుడు దాన్ని రక్తపోటు అని పిలుస్తారు.

అయితే ఈ హైబీపీ ఎక్కువగా యువతలో కనిపిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 20 నుంచి 30 ఏళ్ల వయస్సు వారిలో 5 శాతం, 30 నుంచి 40 ఏళ్ల వారిలో 10 శాతం, 40 నుంచి 50 ఏళ్ల వయసు వారిలో 5 శాతం, 50 నుంచి 60 ఏళ్ల వారిలో 15 శాతం మంది హైపర్ టెన్షన్ తో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరికి ఉండవచ్చని వివరిస్తున్నారు. అధిక రక్తపోటు వల్ల ఎక్కువ మంది గుండె పోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు ఉన్న వారిలో పది శాతం మంది పక్షవాతం బారిన పడగా మరో 5 శాతం మందికి కిడ్నీ సమస్యలు ఉన్నట్లు వివరించారు.