Begin typing your search above and press return to search.

ఓడిపోయేచోట హ‌రీష్ రావుకు బాధ్య‌త‌లు..ఈ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగేది అదేః రేవంత్

By:  Tupaki Desk   |   28 Feb 2021 3:26 AM GMT
ఓడిపోయేచోట హ‌రీష్ రావుకు బాధ్య‌త‌లు..ఈ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగేది అదేః రేవంత్
X
హ‌రీష్ రావు మేన‌మామ - టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్ పై.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హ‌రీష్ ను ఉద్దేశ‌పూర్వ‌కంగానే అప్ర‌తిష్ట‌పాలు చేస్తున్నార‌ని అన్నారు. ఎప్పుడు ఎన్నిలు జ‌రిగినా.. టీఆర్ ఎస్ ఓడిపోయే చోట హ‌రీష్ రావుకు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నార‌ని, అదే.. గెలిచే అవ‌కాశం ఉన్న‌చోట మాత్రం కొడుకు కేటీఆర్ కు అప్ప‌జెప్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యంలోనూ అదే జ‌రుగుతోంద‌ని అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో రెండు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు ఎన్నిక‌ల జ‌ర‌గ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఒక‌టి వ‌రంగల్‌-న‌ల్గొండ‌-ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం కాగా.. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌ నగర్ రెండోది. అయితే.. ఇందులో ఈ రెండో నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ను హ‌రీష్ రావుకు అప్ప‌గించింది టీఆర్ఎస్ అధిష్టానం. వాస్త‌వానికి టీఆర్ఎస్ ఏర్ప‌డిన నాటి నుంచి ఇక్క‌డ ఒక్క‌సారికూడా గెల‌వలేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌ నగర్ నియోజకవర్గానికి 2007 - 2009 - 2015లో ఎన్నిక జ‌రిగింది. ఇందులో రెండుసార్లు టీఆర్ ఎస్ ఓడిపోయింది. 2009లో మాత్రం పోటీకి దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు నాలుగోసారి ఎన్నిక జ‌రుగుతోంది. 2007లో పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాల‌వ్వ‌గా.. 2009లో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కు టీఆర్‌ఎస్‌ మద్దతునిచ్చింది. ఆయన విజ‌యం సాధించారు. 2015లో టీఎన్జీవోస్‌ యూనియన్‌ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయించి టీఆర్‌ ఎస్‌ తరపున బరిలోకి నిలిపినా విజ‌యం దక్కలేదు.

అటు దుబ్బాక‌లో ఓట‌మి - జీహెచ్ ఎంసీ ఫ‌లితాల నేప‌థ్యంలో.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీకి టీఆర్ ఎస్‌ దూరంగా ఉంటుంద‌నే ప్ర‌చారం కూడా సాగింది. కానీ.. చివ‌ర‌కు బ‌రిలో నిలిచింది. ఈ స్థానంలో గులాబీ పార్టీ గెలుపు భారాన్ని హ‌రీష్ రావుకు అప్ప‌గించింది అధిష్టానం. ఇక‌, ఇక్క‌డ కాంగ్రెస్ గెలుపు బాధ్య‌త తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ మూడు జిల్లాల్లోనూ తిరిగి ప్రచారం చేస్తున్నారు రేవంత్‌. ఈ క్ర‌మంలోనే టీఆర్ఎస్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఓటమి ఖాయమని - ఈ ఎన్నిక‌ల త‌ర్వాత హ‌రీష్ రావు క‌న్పించ‌కుండా పోతారని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

ఇక‌, కేసీఆర్ తెలంగాణ తేవ‌డం వల్లే కాంగ్రెస్ - బీజేపీలకు రాష్ట్ర క‌మిటీలు ఏర్ప‌డ్డాయ‌ని, ఇక్క‌డి నేత‌ల‌కు ప్రాధాన్య‌త ద‌క్కుతోంద‌ని కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పైనా రేవంత్ స్పందించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే.. కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయని, ఆ విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.