Begin typing your search above and press return to search.

బీజేపీ, అన్నాడీఎంకే మధ్య కుదిరిన సయోధ్య ... ఎవరికెన్ని ?

By:  Tupaki Desk   |   6 March 2021 12:35 PM GMT
బీజేపీ, అన్నాడీఎంకే మధ్య కుదిరిన సయోధ్య ... ఎవరికెన్ని ?
X
కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకి షెడ్డ్యూల్ విడుదల చేసిన సంగతి. దీనితో ఎన్నికలు జరిగే ప్రధాన ఐదు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు గురించి అన్ని ప్రధాన పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. నామినేషన్లకు దగ్గరపడుతుండటంతో ఆయా పార్టీల కేడర్లల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలోనే తమిళనాడులో బీజేపీ- ఏఐఏడీఎంకే మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది. బీజేపీకి 20 అసెంబ్లీ స్థానాలతో పాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానంను ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకారం తెలిపింది. అన్నాడీఎంకేతో జట్టుకట్టి బరిలోకి దిగుతున్న బీజేపీకి సీట్ల సర్దుబాటులో భాగంగా 20 స్థానాలు దక్కాయి. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది.

ఈ మేరకు ఒప్పందంపై శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌ సెల్వం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడులో పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జి సీటీ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ సంతకాలు చేశారు. అనంతరం ఒప్పందం కాపీని రాత్రి మీడియాకు విడుదల చేశారు. అయితే బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల వివరాలను రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో ఏఐఏడీఎంకే 43 సీట్లను పీఎంకే, బీజేపీలకు కేటాయించింది. కూటమిలోని మరో పార్టీ డీఎండీకే 25 సీట్లలో బరిలోకి దిగాలని యోచిస్తోంది. మొత్తానికి ఏఐఏడీఎంకే 170 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయిస్తోంది. కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బీజేపీకి అన్నాడీఎంకే మద్దతు ఇస్తుంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత హెచ్. వసంత్‌కుమార్ చేతిలో బీజేపీ నేత పొన్ రాధాకృష్ణన్ ఓటమి పాలయ్యారు. అయితే, గతేడాది ఆగస్టులో కరోనా కారణంగా వసంత్ కుమార్ చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇదిలా ఉంటే శుక్రవారం రోజున అన్నాడీఎంకే ఆరుగురు అభ్యర్థుల పేర్లతో ఒక జాబితాను విడుదల చేసింది. తమిళనాడు సీఎం పళనిస్వామి అతని సొంత జిల్లా సేలంలోని ఎడప్పాడి నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా , డిప్యూటీ సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం ఆయన సొంత ఊరైనా బొడినాయకనూర్ నుంచి బరిలో దిగనున్నారు. ఇది తేనీ జిల్లాలో ఉంది. ఇక మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్ రోయపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా, న్యాయశాఖ మంత్రి షన్ముగం విల్లుపురం నుంచి పోటీ చేయనున్నారు. ఇక ఎమ్మెల్యేలు ఎస్పీ షన్ముగనాథన్ శ్రీవాయి‌గుండం నియోజకవర్గం నుంచి బరిలో దిగనుండగా , మరో ఎమ్మెల్యే తేన్ ‌మొళి నీలకొట్టాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.