Begin typing your search above and press return to search.

'హెర్డ్ ఇమ్యూనిటీ' సులవు కాదంటోన్న పరిశోధకులు

By:  Tupaki Desk   |   7 July 2020 3:30 PM GMT
హెర్డ్ ఇమ్యూనిటీ సులవు కాదంటోన్న పరిశోధకులు
X
కరోనా దెబ్బకు ప్రపంచదేశాలన్నీ గడగడలాడుతున్నాయి. కరోనా కేసుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న అమెరికా, స్పెయిన్, భారత్ లలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక కోటీ 70లక్షల మందికిపైగా కరోనాబారినపడ్డారు. 5 లక్షల 41 వేల మందికిపైగా కరోనా బారినపడి మరణించారు. భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. ఇక్కడ మృతుల సంఖ్య 20 వేలకు పైనే ఉంది. కరోనాకు వ్యాక్సిన్ రావడానికి మరి కొద్ది నెలలు పట్టే అవకాశమున్న నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడం ఎలా అని ఆయాదేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు పెరిగాక ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(సామాజిక వ్యాప్తి), హెర్డ్ ఇమ్యూనిటీ(అధిక రోగనిరోధక శక్తి) వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల కరోనాను జయించగలమని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ, ఈ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం అంత సులువేమీ కాదని మాడ్రిడ్ లోని కార్లోస్ 3 హెల్త్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు. కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న స్పెయిన్ కూడా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం అంత వీజీ కాదని చెబుతోంది.

జనాభాలోని సింహభాగం ఏదైనా ఒక వ్యాధి వ్యాపిస్తే, మనుషుల రోగ నిరోధక శక్తి ఆ వ్యాధి వ్యాపించకుండా అడ్డుకునేందుకు సాయం చేస్తుంది. ఆ పరిస్థితుల్లో ప్రజలు ఆ వ్యాధితో పోరాడి పూర్తిగా కోలుకొని‘ఇమ్యూన్’ అవుతారు. అంటే వారిలో రోగ నిరోధక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. వారిలో ఆ వైరస్‌ను తట్టుకోగలిగే ‘యాంటీ-బాడీస్’ తయారవుతాయి. దీనినే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. క్రమక్రమంగా ప్రజలంతా ‘ఇమ్యూన్’ అయ్యే కొద్దీ, వైరస్ వ్యాపించే ప్రమాదం కూడా తగ్గుతుంది. దానివల్ల కరోనా రానివారికి, ఆ వ్యాధికి ఇమ్యూన్ కాని వారికి పరోక్షంగా రక్షణ లభిస్తుంది. ఒక మనుషుల గుంపులో ఎక్కువ శాతం మంది వైరస్ నుంచి ఇమ్యూన్ అయిపోతే, అది ఆ గుంపు మధ్యలో ఉన్న వారి వరకూ చేరడం చాలా కష్టం అవుతుంది. ఒక పరిమితి తర్వాత దాని వ్యాప్తి ఆగిపోతుంది. అయితే, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడానికి చాలా సమయం పడుతుంది. ఏదైనా టీకా వేసే కార్యక్రమం సాయంతో అత్యంత సున్నితమైన వ్యక్తులు కూడా సురక్షితంగా ఉన్నారని నిర్ధారణ అయినప్పుడు దానిని `హెర్డ్ ఇమ్యూనిటీ`గా భావిస్తారు.

అయితే, స్పెయిన్ లో అత్యధిక కేసులు నమోదవుతుండడంతో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమేమోనన్న కోణంలో ఆ పరిశోధుకులు సర్వే చేశారు. స్పెయిన్ లోని 61 వేల మందిపై సర్వే జరపగా....వారిలో 5 శాతం మందికి మాత్రమే కరోనాను పోరాడే యాంటీ బాడీస్ ఉన్నాయని తేలింది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వివరాల ప్రకారం “హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయికి చేరుకోవాలంటే సుమారు 80 శాతం జనాభా ఇమ్యూన్ కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే, ప్రతి ఐదుగురిలో నలుగురు కరోనా రోగుల కాంటాక్టులోకి వచ్చినా, అది వారికి రాకపోతే.. దానిని నియంత్రించవచ్చని, ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ స్థాయికి చేరుకోడానికి సాధారణంగా 70 నుంచి 90 శాతం జనాభా ఇమ్యూన్ కావడం తప్పనిసరి అని చెబుతున్నారు. కాబట్టి ఇపుడున్న పరిస్థితుల్లో అమెరికా, స్పెయిన్, భారత్ లలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం అంత సులువు కాదని పరిశోధకులు తేల్చేశారు.