Begin typing your search above and press return to search.

ఏపీ పై కేసీఆర్‌ నిరాసక్తతకు కారణం అదేనా?

By:  Tupaki Desk   |   29 May 2023 7:00 PM GMT
ఏపీ పై కేసీఆర్‌ నిరాసక్తతకు కారణం అదేనా?
X
టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించారు.. కేసీఆర్‌. ఇందుకనుగుణంగా తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లతోపాటు వీటికి సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడుల్లోనూ బీఆర్‌ఎస్‌ ను విస్తరించాలని ఆశించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 150 సీట్లలో పోటీ చేయాలని.. వీటిలో అత్యధిక సీట్లలో తమ సత్తా చాటుకోవాలని కేసీఆర్‌ పెద్ద కలలే కన్నారు.

ఇందుకు తగ్గట్టే ఏపీలో మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబులాంటి వాళ్లను పార్టీలో చేర్చుకున్నారు. తోటను బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడిని చేశారు. వీరే కాకుండా ప్రధాన పార్టీల నుంచి కూడా భారీ ఎత్తున నేతలు చేరతారని ప్రకటనలు చేశారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, కర్నూలుల్లో కేసీఆర్‌ భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఇప్పటివరకు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌ బాబు మినహాయించి కేసీఆర్‌ పార్టీలో చేరినవారెవరూ లేరు. అలాగే కేసీఆర్‌ ఏపీలో సభలు నిర్వహించిన పరిస్థితి కూడా లేదు. ఈ మధ్యలో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా కేసీఆర్‌ రక్షిస్తారని.. ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా బిడ్‌ వేస్తారని బీఆర్‌ఎస్‌ నేతలు ఒకటే హడావుడి చేశారు. దీనికి కూడా అతీలేదు.. గతీ లేదు.

కేసీఆర్‌ కూడా తెలంగాణ బయట ప్రధానంగా మహారాష్ట్రలో మాత్రమే ఇప్పటివరకు సభలు నిర్వహించారు. తరచూ మహారాష్ట్రలో పర్యటిస్తూ చోటామోటా నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పై మాత్రం కేసీఆర్‌ నిరాసక్తతకు పలు కారణాలున్నాయంటున్నారు. ఉమ్మడి ఏపీని విభజించి తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ పార్టీని ఏపీ ప్రజలు నిలువునా పాతేశారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీకే ఏపీలో ఈ గతి పడితే ఇక తెలంగాణను తెచ్చానని చెప్పుకుంటున్న కేసీఆర్‌ పార్టీకి ఏ గతి పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని విశ్లేషకులు అంటున్నారు.

అందులోనూ కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను దొంగలని, తెలంగాణను దోచుకుంటున్నారని ఇలా పలు రకాలుగా దూషించారు. ఇక కేసీఆర్‌ పార్టీ నేతల మాటల గురించి చెప్పాల్సిన పనేలేదు. వీరి మాటలను ఏపీ ప్రజలు ఎవరూ మర్చిపోలేదు.

ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో పోటీ చేస్తే కేసీఆర్‌ పార్టీకి మాడు పగలడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ జగన్‌ మొదటి నుంచి కేసీఆర్‌ కు చిరకాల మిత్రుడు మాదిరిగా వ్యవహరిస్తున్నారని టాక్‌. 2019 ఎన్నికల్లో కేసీఆర్‌ నుంచి జగన్‌ కు భారీ ఆర్థిక సహాయం అందిందనే గాసిప్స్‌ కూడా వినిపించాయి.

ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో తాను వేలుపెడితే జగన్‌ కు కోపం వస్తుందేమోనని కే సీఆర్‌ సంశయిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ ఏపీ రాజకీయాల్లో వేలుపెడితే.. జగన్‌ కూడా తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టడం ఖాయమని చెబుతున్నారు. దీంతో ఎందుకులే ఈ పేచీ అనుకునే కేసీఆర్‌ ఏపీలో అడుగుపెట్టడం లేదని అంటున్నారు.

చివరకు ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా కేసీఆర్‌ రాలేదు. కనీసం ఆ పార్టీ నేతలెవరూ కూడా హాజరుకాకపోవడం గమనార్హం. ఎక్కడెక్కడో చిన్నచితకా కార్యాలయాలను కూడా ప్రారంభించిన కేసీఆర్‌ ఏపీలో రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి రాకపోవడం ఏపీ రాజకీయాలపై కేసీఆర్‌ నిరాసక్తతకు నిదర్శనమంటున్నారు.