Begin typing your search above and press return to search.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు అలా మారిందట

By:  Tupaki Desk   |   12 Aug 2022 12:33 PM GMT
రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు అలా మారిందట
X
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందరి ఫోకస్ మునుగోడు మీదనే ఉందన్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక వచ్చిందంటే చాలు.. సదరు నియోజకవర్గం దశ తిరిగిపోయేలా.. ఇంతకాలం అసలేం జరిగింది? అన్న వేదన నుంచి.. యుద్ద ప్రాతిపదికన జరిగే పరిణామాలకు నోరెళ్ల బెట్టే పరిస్థితి. ఆ మధ్యన ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ లో ఎన్ని సిత్రాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే. ఇప్పుడు అలాంటి సీనే మళ్లీ రిపీట్ అవుతుందన్న మాట వినిపిస్తోంది.

తాజాగా మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..తన రాజీనామా అనంతరం మునుగోడులో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వాతావరణం వేడెక్కటమే కాదు.. ప్రభుత్వం కూడా పరుగులు తీసేలా పనులు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తన రాజీనామా తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని.. తన రాజీనామా తర్వాత చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేవారు.

అంతేకాదు.. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారని.. నియోజకవర్గంలోని డెవలప్ మెంట్ పనుల మీద ఫోకస్ పెడుతున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. గ్రామాల్లో ఇంతవరకు పట్టని సర్పంచ్ లు ఒక్కసారిగా గుర్తుకు రావటమే కాదు.. వారికి ప్రభుత్వ పెద్దలు ఫోన్లు చేస్తున్న వైనాన్ని ఆయన వెల్లడించారు. తన రాజీనామా తర్వాత సర్పంచ్ లకు ఫోన్లు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో నిధులు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందన్న ఆయన.. ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని.. మొన్నటివరకు మునుగోడు గురించి మాట్లాడితే పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు తన రాజీనామా తర్వాత మాత్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి నిధులు కేటాయించే విషయంలో ముందుకు రాని ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వేలాది కోట్ల రూపాయిల పనులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికా మజాకానా?