Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటుకు కాదు.. మోడీకే ప‌ట్టాభిషేకం: రాహుల్‌ ఫైర్‌

By:  Tupaki Desk   |   28 May 2023 1:55 PM GMT
పార్ల‌మెంటుకు కాదు.. మోడీకే ప‌ట్టాభిషేకం:  రాహుల్‌ ఫైర్‌
X
ఢిల్లీ లో కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. రెండు విడ‌త‌ల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఉద‌యం 6 గంట‌ల‌ కు ముందే పూజ నిర్వ‌హించారు. త‌ర్వాత‌.. సింగోల్ రాజ‌దండాన్ని ప్ర‌తిష్టించారు. దీనికి ముందు హోమాలు నిర్వ‌హించారు. ఆయా కార్య‌క్ర‌మాల్లో ప్ర‌ధాని మోడీ, స్పీక‌ర్ ఓం బిర్లాలు మాత్ర‌మే పాల్గొన్నారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మాల‌ కు 20 పార్టీలు హాజ‌రుకాలేదు.

ఇదిలావుంటే.. పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని జ‌రిగిన తంతు ను కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. పార్ల‌మెంటు కొత్త భ‌వ‌నానికి ప‌ట్టాభిషేకం కాదు.. ప్ర‌ధాని మోడీ త‌న‌ కు తాను ప‌ట్టాభిషేకం చేసుకుంటున్నార‌ని.. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ప్రారంభోత్సవమా ? మోడీ పట్టాభిషేకమా ? అని రాహుల్ గాంధీ ప్ర‌శ్నించారు.

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అంతా.. ఇటీవ‌ల జ‌రిగిన బ్రిట‌న్ రాజు ప‌ట్టాభిషేక కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పించింద‌ని వ్యాఖ్యానించారు. మోడీ త‌న‌న‌ ను తాను రాజులా వ్యవహరిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని మోడీ తన పట్టాభిషేకంగా కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పార్లమెంట్ అంటే ప్రజల గొంతు వినిపించే వేదికని రాహుల్ హితవు పలికారు. అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో రాష్ట్ర‌ప‌తి కి విలువ‌లేకుండా చేశార‌ని నిప్పులు చెరిగారు. ఇక‌, దేశానికి మోడీ కొత్త రాజ్యాంగం తీసుకువ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌న్నారు.