Begin typing your search above and press return to search.

మారిటోరియంపై ఏపీని గుర్తు చేసి మరీ రాజన్ వార్నింగ్

By:  Tupaki Desk   |   6 Aug 2020 4:00 AM GMT
మారిటోరియంపై ఏపీని గుర్తు చేసి మరీ రాజన్ వార్నింగ్
X
భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా వ్యవహరించిన రాజన్ ను మర్చిపోలేరు. సమర్థుడైన గవర్నర్ గా ఆయన పేరు పొందారు. మోడీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. తన దారిన తాను చూసుకొని వెళ్లిపోయారు. ప్రస్తుతం పాఠాలు చెప్పుకుంటున్న ఆయన..కొన్ని సందర్భాల్లో మాత్రం తనకు అనిపించిన విషయాల్ని నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు. కరోనా వేళ.. భారత్ లోని పరిస్థితులు.. ప్రభుత్వ విధానాల గురించి ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

లాక్ డౌన్ నేపథ్యంలో లోన్లపై మారిటోరియం విధించటం.. దాన్ని పొడిగించటం తెలిసిందే. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. రిజర్వుబ్యాంకు కల్పించిన మారిటోరియంను ఈ ఏడాది చివరి వరకు కొనసాగించాలన్న మాట అంతకంతకూ పెరుగుతోంది. పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు ఇప్పటికి తెరవకపోవటం.. ఉద్యోగాలు పోయిన నేపథ్యంలో రుణాల తిరిగి చెల్లించటం కష్టంగా మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటివేళలో ఈ ఏడాది చివరి వరకు మారిటోరియం విధిస్తే మంచిదని విన్నపాలు వినిపిస్తుంటే.. రాజన్ మాత్రం అందుకు నో చెబుతున్నారు.

మొన్నీ మధ్యనే స్టేట్ బ్యాంక్ ఇండియా ఛైర్మన్ సైతం మారిటోరియంను పొడిగించటం మంచిదికాదని చెప్పటం గమనార్హం. తాజాగా రాజన్ సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. తాజాగా ఒక ఇంటర్య్వూ లో మాట్లాడిన సందర్భంగా రాజన్.. మారిటోరియం పొడిగింపు ఏ మాత్రం అవసరం లేదన్నారు. ఈ తీరుకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. తన వ్యాఖ్యల్లో హేతుబద్ధత సరైనదన్న ఆయన.. ఏపీలోని మైక్రో ఫైనాన్స్ సంక్షోభాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మారిటోరియం గురించి ప్రశ్నించినంతనే.. ‘ఏపీలోని మైక్రో ఫైనాన్స్ క్రైసిస్ గుర్తున్నాయిగా’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజలకు ఒకసారి చెప్పిన తర్వాత.. వారుడబ్బులు ఆదా చేయరన్నారు. ‘‘దీంతో లోన్ తిరిగి చెల్లించటం కష్టమవుతుంది. దీంతో.. తిరిగి చెల్లింపులు తీసుకొచ్చే అలవాటు చేయటం కష్టమవుతుంది. గతంలో ఏపీలో నెలకొన్న మైక్రో ఫైనాన్స్ సంక్షోభానికి కారణం కూడా ఇదే. ఈ కారణంతో సూక్ష్మ ఆర్థిక సంస్థలు బలహీనపడతాయి. ఎక్కువకాలం మారిటోరియం విధిస్తే.. ఆ మొత్తాల్ని తిరిగి వసూలు చేసుకోవటం బ్యాంకులకు కష్టమవుతుంది’’ అని పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు బాగా పని చేసిందని చెప్పిన ఆయన.. రూపాయి మరీ పడిపోలేదన్నారు. అందుకు ఆర్బీఐకి థ్యాంక్స్ చెప్పాలన్నారు. కరోనా పెరుగుతున్నప్పటికీ దేశ వృద్ధి రేటు మీద భయాలు కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రూపాయి క్షీణించలేదన్నారు. సంక్షోభ సమయంలో ఆర్టీఐ సమర్థవంతమైన బాధ్యతను నిర్వర్తించిందన్నారు. మారిటోరియంపై ఒకరి తర్వాత ఒకరు ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. ప్రభుత్వం ఈసారి పొడిగించే అవకాశం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.