Begin typing your search above and press return to search.

తెలంగాణపై ప్రియాంక ఫోకస్.. మొదటి అడుగు మొదలైంది

By:  Tupaki Desk   |   8 Jun 2023 9:58 AM GMT
తెలంగాణపై ప్రియాంక ఫోకస్.. మొదటి అడుగు మొదలైంది
X
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో వచ్చిన ఆత్మవిశ్వాసం కాంగ్రెస్ పార్టీలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు తమ తర్వాతి టార్గెట్ ను తెలంగాణగా నిర్ణయించుకుంది. మరోనాలుగు నెలల వ్యవధిలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా..కాంగ్రెస్ ప్రయారిటీలో తెలంగాణ ఒకటిగా మారింది. కొత్త రాష్ట్రాన్నిఇచ్చి.. చేతిలో ఉన్న అధికారాన్ని పోగొట్టుకున్న వైనంపై వేదనతోఉన్న కాంగ్రెస్.. రాష్ట్ర పాలన పగ్గాల్ని తాము అందుకోవాలన్న తపనతో ఉంది. దీనికి తగ్గట్లే.. అధినాయకత్వం ఇప్పుడో కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలకభూమిక పోషించి.. నేతల మధ్య పంచాయితీలను పక్కన పెట్టించి.. కలిసి కట్టుగా పని చేసేలా చేసిన ప్రియాంక వాద్రాను.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్ని చూసుకునే బాధ్యతను అప్పజెప్పనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ పార్టీ బాధ్యతల్ని మోస్తున్న ప్రియాంక.. దాని నుంచి పూర్తిగా బయటకు వచ్చేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపై తెలంగాణ ఎన్నికల వ్యవహారాలు మొత్తం ప్రియాంక కనుసన్నల్లో జరిగేలా ప్లానింగ్ చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణతో పాటు.. ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయటం.. ఈశాన్య రాష్ట్రంలో జరిగే ఎన్నికను ఆమె పెద్దగా పట్టించుకోరని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఇన్ ఛార్జిగా ఉన్న ప్రియాంకను.. ఆ బాధ్యత నుంచి తప్పించి పార్టీ సీనియర్లు అయిన హరీశ్ రావత్.. తారిఖ్ అన్వర్ లలో ఒకరిని అక్కడ నియమిస్తారని చెబుతున్నారు.

ప్రియాంక ఎంట్రీతో తెలంగాణ కాంగ్రెస్ లోని గ్రూప్ పంచాయితీలకు ముగింపు పలకటంతో పాటు.. అందరూ పని చేసేలా చూడటం.. ఎవరికి వారు తమకు ఢిల్లీలో బలం ఉందన్న మాటకు చెక్ పెట్టేలా చేయటం ప్రస్తుత ప్లానింగ్ గా చెబుతున్నారు. ఇప్పటివరకు తమకు అధిష్ఠానం అండగా ఉంటుందని చెప్పుకునే నేతలు.. ఇప్పుడు అధిష్ఠానమే నేరుగా తెలంగాణ మీద ఫోకస్ చేసి.. గ్రౌండ్ లో పని చేస్తున్న వేళ.. ఇంతకాలం ఆ పార్టీకి తలనొప్పిగా మారిన గ్రూపుల పంచాయితీలు చాలావరకు తగ్గే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇందులో భాగంగా రానున్న వారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.

నియోజకవర్గాల్లోని గ్రూపుల మద్య విభేదాలు.. వివాదాలకు చెక్ పెట్టటంతోపాటు.. అలాంటి వాటిని పెంచి పోషించే సీనియర్లకు నేరుగా హెచ్చరికలు అందుతాయని చెబుతున్నారు. పార్టీని పూర్తిగా గాడిన పెట్టటమే ప్రియాంక మొదటి లక్ష్యమని చెబుతున్నారు. కర్ణాటకలో అనుసరించిన ఫార్ములానే తెలంగాణలోనూ అమలు చేస్తారని చెబుతున్నారు. కర్ణాటకలో మాదిరి సీనియర్లకు పార్టీ పటిష్ఠత బాధ్యతలు కట్టబెట్టటం.. వాటిని సమర్థంగా అమలు చేయటం చేయనున్నారు. దీనికి తోడుగా ప్రియాంక పర్యటనలు.. రోడ్ షోలు.. ర్యాలీలు ఎక్కువగా ఉండేలా ప్లానింగ్ చేస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల్లో ప్రియాంక 17రోడ్ షోలతో పాటు 13 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. వివిధ వర్గాలతో సమావేశాల్ని నిర్వహించారు. అనేక దేవాలయాల్ని సందర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వర్గాలతో మమేకం కావటం.. అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించేలా హామీలు ఇచ్చే వ్యూహాన్ని అమలు చేయనున్నారు. కేసీఆర్ సర్కారు అవినీతి.. అక్రమాలపై పెద్ద ఎత్తున ప్రియాంక గళం విప్పుతారని చెబుతున్నారు.