Begin typing your search above and press return to search.

యూత్ కు కొత్త టాస్కు ఇచ్చిన ప్రధాని మోడీ

By:  Tupaki Desk   |   25 Jan 2021 6:50 AM GMT
యూత్ కు కొత్త టాస్కు ఇచ్చిన ప్రధాని మోడీ
X
వ్యక్తిత్వ వికాస నిపుణుడికి మించినట్లుగా ఉంటాయి ప్రధాని మోడీ చెప్పే మాటలు వింటే. ఆయన నిత్యం ప్రవచనాలు బోధిస్తుంటారు. విలువలు నేర్పించే ప్రయత్నం చేస్తారు. చెప్పే మాటలకు చేసే చేతలకు ఏ మాత్రం పొంతన లేని రీతిలో ఆయన రాజకీయాలు ఉంటాయని చెప్పక తప్పదు. అధికారం కోసం ఆయన పార్టీ అనుసరించే తీరును.. ఇన్ని మాటలు చెప్పే మోడీ ఎందుకు కంట్రోల్ చేయరన్న భావన కలుగక మానదు.

సూక్తిముక్తావళిలోని మాటలకు ఏ మాత్రం తగ్గని రీతిలో మాటలు చెప్పే మోడీ.. తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్ సీసీ క్యాడెట్ల రిపబ్లిక్ డే రిహార్సల్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నిర్వహించిన అద్భుతమైన విన్యాసాల్ని తిలకించారు. మోడీతో పాటు ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ సీసీ క్యాడెట్లను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ యువతకు కొత్త టాస్కును ఇచ్చారు ప్రధాని మోడీ.

తాజాగా దేశంలో వేగవంతంగా కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎన్నో అనుమానాలు.. అపోహలు చోటు చేసుకుంటున్నాయి. మీడియాలో వచ్చే వార్తలకు భిన్నంగా.. సోషల్ మీడియాలో సత్యాలతో సంబంధం లేని కొన్ని ఫేక్ వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో.. వ్యాక్సిన్ మీద కొత్త సందేహాలు.. భయాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తన ఫోకస్ ను వ్యాక్సినేషన్ మీద పెట్టినట్లుగా కనిపిస్తోంది. దీనికి తగ్గట్లే మోడీ తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.

కోవిడ్ వ్యాక్సిన్ పై దేశ ప్రజలకు సరైన సమాచారం ఇవ్వటంలో యువత కీలక పాత్ర పోషించినట్లుగా పేర్కొన్నారు. వ్యాక్సిన్ పై పుకార్లను తిప్పికొట్టేందుకు యువత నడుం బిగించాలన్నారు. ప్రతి గ్రామంలోనూ యువత వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఆయన.. పేదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వ్యాక్సిన్ పై తప్పుడు ప్రచారాన్ని యువత నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరుతో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు.

దేశంలో రాజ్యాంగమే సుప్రీం అన్న భావనను కలిగిస్తుందన్న ఆయన.. యువత కష్టపడితేనే భారత్ అన్ని రంగాల్లో స్వయం సంవృద్దిని సాధిస్తుందన్నారు. ఎవరో చెప్పిన మాటల్ని వినకుండా యువత తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు కృషి చేయాలన్నారు. భారత సామాజిక సాంస్కృతిక వైభవానికి రిపబ్లిక్‌ డే పరేడ్‌ అద్దం పడుతుందని చెప్పిన యోడీ.. స్వయం సమృద్ధ భారత దేశం అన్న కల సాకారం కావటం యువత మీదనే ఆధారపడి ఉందన్నారు.