Begin typing your search above and press return to search.

పోలీసులపై ఏపీ హైకోర్టు ఏమంది?

By:  Tupaki Desk   |   24 Oct 2021 9:30 AM GMT
పోలీసులపై ఏపీ హైకోర్టు ఏమంది?
X
గడిచిన నాలుగైదు రోజులుగా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం.. ఎప్పుడూ చూడని పరిస్థితులు.. ప్రతిపక్ష పార్టీకి చెందిన పార్టీ ప్రధాన కార్యాలయంపై అధికార పార్టీకి చెందిన సానుభూతిపరులు కర్రలు.. రాడ్లతో దాడి చేసిన వైనం.. దానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిచేసిన వ్యాఖ్యలు.. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కె. పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్ కు తరలించటం తెలిసిందే.

దీనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పట్టాభికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గౌరవం.. ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు.. అందరికీ ఉంటాయని.. వాటిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. పట్టాభి అరెస్టు సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించారా? లేదా? అన్న విషయంపై నివేదిక సమర్పించాలని విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ను ఆదేశించింది.
బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసుల తీరును హైకోర్టు ధర్మాసనం ఎండగడుతూ.. పలు ప్రశ్నల్ని సంధించింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. హైకోర్టు ధర్మాసనం ఏమన్నది చూస్తే.

పట్టాభిని అరెస్ట్‌ చేసే ఉద్దేశం ఉంటే 41ఏ కింద నోటీసులు ఎందుకిచ్చారు? ఆ తరువాత ఎందుకు అరెస్ట్‌ చేశారు? 41ఏ కింద నోటీసులు ఇచ్చే విధానం ఇదేనా? ఈ సెక్షన్‌ కింద నోటీసులు ఇచ్చిన తరువాత మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండా పిటిషనర్‌ను ఎలా అరెస్ట్‌ చేశారు?
ఒకవైపు పట్టాభిని అరెస్ట్‌ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లామని చెబుతూ... మరోవైపు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చామంటున్నారు. సహకరించకపోవడంతోనే అరెస్ట్‌ చేశామని పరస్పర విరుద్ధమైన వివరాలను దర్యాప్తు అధికారి రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనడం ఆత్మహత్యా సదృశం కాదా?

రాజ్యాంగబద్ధ సంస్థలు, న్యాయమూర్తులను దూషిస్తున్నవారి విషయంలో చర్యలు తీసుకొనేందుకు ఉత్సాహం చూపని పోలీసులు... పట్టాభి అరెస్ట్‌ విషయంలో అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం ఏముంది?

పోలీసులు అనుసరించాల్సిన విధానం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. వ్యక్తులను బట్టి అది మారదు. రాష్ట్రంలో పోలీసులకు రూల్‌ ఆఫ్‌ లా అంటే గౌరవం లేదు. చట్టానికి లోబడి అందరూ పని చేయాల్సిందే. రూల్‌ ఆఫ్‌ లా అమలు విషయంలో పోలీసుల వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ రోజూ పలు వ్యాజ్యాలు విచారణకు వస్తున్నాయి. చట్టం ముందు సీఎం నుంచి సామాన్యుడి వరకు అందరూ సమానమేనని, చట్టాని కంటే ఎవరూ ఎక్కువ కాదు. గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు... అందరికీ ఉంటాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.