Begin typing your search above and press return to search.

టీడీపీకి రాజీనామా.. భార్య‌భ‌ర్త‌లు వైసీపీలోకి!

By:  Tupaki Desk   |   23 Jan 2020 6:19 AM GMT
టీడీపీకి రాజీనామా.. భార్య‌భ‌ర్త‌లు వైసీపీలోకి!
X
ఒక వైపు మండ‌లిలో త‌మ బ‌లాన్ని చూసి తెలుగుదేశం పార్టీ మురిసిపోతూ ఉంది. మండ‌లికి ఉన్న ప‌వ‌ర్ త‌క్కువే అని నిపుణులు చెబుతూ ఉన్నారు. వికేంద్రీక‌ర‌ణ బిల్లును మండ‌లిలో ప్ర‌స్తుతానికి అడ్డుకున్నా.. అది తాత్కాలిక‌మే అంటున్నారు. ఇక మండ‌లిలో తెలుగుదేశం పార్టీకి ఉన్న మెజారిటీ కూడా క్ర‌మంగా క‌రిగిపోతున్న దాఖ‌లాలు క‌నిపిస్తూ ఉన్నాయి. ఇప్ప‌టికే మండ‌లిలో తెలుగుదేశం పార్టీకి కొంత‌మంది ఎదురుతిరిగారు. కొంత‌మంది తెలుగుదేశం పార్టీ తీర్మానానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించారు.

ఆ జాబితాలో ఒక‌రు పోతుల సునీత‌. ఈమె తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌కాశం జిల్లా కోటాలో ఈమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈమె భ‌ర్త పోతుల సురేష్ గ‌తంలో ప‌రిటాల ర‌వి అనుచ‌రుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు ప‌రిటాల కుటుంబం అమ‌రావ‌తి కోసం ఆరాట‌ప‌డుతూ ఉంది. అయితే పోతుల కుటుంబం మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ట వైపు చేరుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

పోతులు సునీత‌, సురేష్ లు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే పోతులు సురేష్ అమ‌రావ‌తి ప్రాంతంలోనే ఉండ‌గా, క‌ర్నూలు నుంచి పోతుల సురేష్ అమ‌రావ‌తి ప్రాంతానికి చేరుకున్న‌ట్టుగా స‌మాచారం. ఈ దంప‌తులు ఇద్ద‌రూ ఇప్పుడు జాయింటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకోనున్నార‌ని తెలుస్తోంది.

ఇదే ఊపులో మ‌రి కొంద‌రు ఎమ్మెల్సీలు కూడా వైసీపీలో చేరే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. అయితే వైసీపీలోకి చేరే ఎమ్మెల్సీలు త‌మ ప‌ద‌వుల‌ను కోల్పోయే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.