Begin typing your search above and press return to search.

ఆంధ్రా పారిస్‌ ఎవరికి?

By:  Tupaki Desk   |   30 Jan 2023 8:32 PM IST
ఆంధ్రా పారిస్‌ ఎవరికి?
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీలో తెనాలి నియోజకవర్గం టెన్షన్‌ సృష్టిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీకి చెందిన అన్నాబత్తుని శివకుమార్‌ ఉన్నారు. ఏఎస్‌ఎన్‌ విద్యా సంస్థల అధినేతగా ఉన్న శివకుమార్‌ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. ఇక టీడీపీ తరఫున ఇక్కడ 2014 ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (రాజా) గెలుపొందారు.

1994, 1999ల్లో వేమూరు నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు.. ఆలపాటి రాజా. అయితే 2004లో ఆలపాటి ఓడిపోయారు. ఇక 2009లో వేమూరు ఎస్సీ రిజర్వుడ్‌గా మారడంతో ఆలపాటి తెనాలి నుంచి పోటీ చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడు, ప్రస్తుతం జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా 2014 ఎన్నికల్లో ఆలపాటి రాజా టీడీపీ తరఫున తెనాలి నుంచి గెలుపొందారు. ఇక 2019లో అన్నాబత్తుని శివకుమార్‌ వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి రాజాపై గెలుపొందారు.

అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు కుదిరే పక్షంలో తెనాలి సీటును జనసేనకు వదిలేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో పవన్‌ కల్యాణ్‌ తర్వాత స్థానంలో నెంబర్‌ టూగా ఉన్నారు. అంతేకాకుండా గతంలో రెండు పర్యాయాలు 2004, 2009ల్లో నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెనాలి నుంచి గెలుపొందారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెనాలి సీటును జనసేన పార్టీకి వదిలేయాల్సి ఉంటుంది. కాగా తెనాలి నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు, కాపు ఓటర్లు సమానంగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఈ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఘన విజయం ఖాయం.

ఒకవేళ తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తే.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, గతంలో సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు సీటు హుళక్కే అయినట్టే. మరి ఈ నేపథ్యంలో ఆలపాటి రాజాకు ఎక్కడ కేటాయిస్తారో తేలాల్సి ఉంది. మరోవైపు అటు అన్నాబత్తుని శివకుమార్, ఆలపాటి రాజా, నాదెండ్ల మనోహర్‌ ముగ్గురు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం.

జనసేన పార్టీకి సీటు కేటాయిస్తే ఆలపాటి రాజా ఎమ్మెల్సీగా అవకాశమివ్వవచ్చని చెబుతున్నారు. లేదా గుంటూరు నుంచి ఎంపీ పదవికి పోటీ చేయించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. లేదా గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజాను బరిలోకి దింపొచ్చని అంటున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి 2019లో టీడీపీ అభ్యర్థి మద్ధాలి గిరిధర్‌ గెలిచారు. అయితే ఆ తర్వాత పార్టీ ఫిరాయించి వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడ టీడీపీకి పార్టీ అభ్యర్థి లేరు. ఈ నేపథ్యంలో ఆ సీటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ కు ఇవ్వవచ్చని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.