Begin typing your search above and press return to search.

అమృత్‌ పాల్‌ వ్యవహారంలో పోలీసుల పురోగతి!

By:  Tupaki Desk   |   21 March 2023 3:20 PM GMT
అమృత్‌ పాల్‌ వ్యవహారంలో పోలీసుల పురోగతి!
X
ప్రత్యేక ఖలిస్తాన్‌ ఉద్యమంతో పంజాబ్‌ లో తీవ్ర అలజడికి కారణమవుతున్న అమృత్‌ పాల్‌ కోసం పంజాబ్‌ పోలీసులు వేట సాగిస్తున్నారు. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అతడు పోలీసుల కన్నుగప్పి కెనడాకు పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.

కాగా అమృత్‌ పాల్‌ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. అతడి ఆచూకీ కనిపెట్టడానికి వరుసగా నాలుగో రోజు పెద్ద ఎత్తున గాలిస్తున్న పంజాబ్‌ పోలీసులు ముమ్మరంగా వేటాడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ నుంచి తప్పించుకుని పోయేందుకు అమృత్‌ పాల్‌ ఉపయోగించిన రెండో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడి దుస్తులు కూడా లభించాయని తెలుస్తోంది.

దీంతో అతడు పంజాబ్‌ దాటి పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అమృత్‌ పాల్‌ ను పట్టుకోవడానికి పోలీసులు 100 వాహనాల్లో అతడిని వెంటాడిన సంగతి తెలిసిందే. అతడిని అరెస్టు చేయడానికి పక్కా వ్యూహంతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. అయినప్పటికీ అమృత్‌ పాల్‌ పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నాడు.

పోలీసులు తనకోసం వెతుకుతున్నారని సమాచారం అందగానే తాను ప్రయాణిస్తున్న మెర్సిడెస్‌ వాహనాన్ని అమృత్‌ పాల్‌ అక్కడే వదిలేసి బ్రెజా కారులో వేరే మార్గంలో ఉడాయించాడని చెబుతున్నారు. అతడి కోసం పోలీసులు పంజాబ్‌ అంతటా ముమ్మర గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో మార్చి 20న మెర్సిడెస్‌ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులోనే అతడి బట్టలు, కొన్ని ఆయుధాలు లభించాయి. ఈ మెర్సిడెస్‌ వాహనంలోనే అమృతపాల్‌ తన దుస్తులను మార్చుకున్నట్టు తెలుస్తోంది. తర్వాత తన అనుచరుడి ద్విచక్రవాహనంపై పంజాబ్‌ సరిహద్దులను దాటి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌ కు వెళ్లి అక్కడ నుంచి పంజాబీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్న కెనడాకు అమృత్‌ పాల్‌ వెళ్తాడని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు అమృత్‌ పాల్‌ పారిపోయేందుకు సహకారం అందించిన అతడి అనుచరుల్లో 114 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో అమృత్‌ పాల్‌ మేనమామ హర్జీత్‌ సింగ్‌ కూడా ఉన్నాడు.

అతడిపైన పోలీసులు కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కేసు నమోదు చేశారు. హర్జీత్‌ ను అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైలుకు తీసుకుపోయారు. అదేవిధంగా అమృత్‌ పాల్‌ ముఖ్య అనుచరుల్లో ఐదుగురిపైన కూడా జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఇంకోవైపు పంజాబ్‌ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ నెట్‌ సేవలపై ఆంక్షలు విధించారు. వీటిలో కొంత మేర ఆంక్షలను సడలించారు. సమస్య లేదనుకున్న చోట ఇంటర్‌ నెట్‌ సేవలను కాస్త పునరుద్ధరించారు.


అయితే సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలయిన తరన్‌ తరన్, ఫిరోజ్‌ పూర్, మోఘా, సంగ్రూర్, అమృత్‌ సర్‌ లోని అజ్‌ నాలా సబ్‌ డివిజన్, మొహాలీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.