Begin typing your search above and press return to search.

జ‌న‌సైనికుడి వినూత్నయ‌త్నం.. ప‌ల్నాడులో 'ఇంటింటికీ జ‌న‌వాణి'

By:  Tupaki Desk   |   31 Jan 2023 1:28 PM GMT
జ‌న‌సైనికుడి వినూత్నయ‌త్నం.. ప‌ల్నాడులో ఇంటింటికీ జ‌న‌వాణి
X
జ‌న‌సేనికుడు ఒక‌రు గొప్ప సంక‌ల్పం చాటి చెప్పారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. జ‌న‌వాణి-జ‌న‌భ‌రోసా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల స‌మస్య‌లు తెలుసుకుని.. వాటిని లిఖిత పూర్వ‌కంగా తీసుకుంటున్నారు.

వీటిని ప్ర‌భుత్వానికి అందించి.. ఆయా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప‌లు న‌గ‌రాల్లో స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొని ఈ కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విష‌యం తెలిసిందే.

అయితే.. తాజాగా జ‌న‌సైనికుడు ఒక‌రు 'జనవాణి - జనసేన భరోసా' కార్యక్రమం స్ఫూర్తితో పల్నాడు ప్రాంత సమస్యలు తెలుసుకొని ప‌వన్ కళ్యాణ్ చెంతకు తీసుకొచ్చేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఆయ‌నే జన సైనికుడు బాలాజీ. గుంటూరుకు న‌గ‌రానికి చెందిన బాలాజీ.. రాజ‌కీయాల ప‌ట్ల ఎంతో మ‌క్కువ చూపిస్తారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన త‌ర‌ఫున కొన్నాళ్లుగా ప‌నిచేస్తున్నారు.

ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ప్రాణం పెట్టే ఆయ‌న‌.. జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని త‌న ప్రాంతంలోనే నిర్వ‌హించారు. స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి 'పల్నాడు ప్రజా సమస్యల పెట్టె' పేరిట వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. వారి నుంచి అర్జీలు తీసుకున్నారు. వీటిని పెద్ద ట్రంకు పెట్టెలో పెట్టుకుని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు హైద‌రాబాద్‌లో అందించారు.

పల్నాడు ప్రాంతంలో పల్లె పల్లె తిరుగుతూ ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించిన బాలాజీని ఈ సంద‌ర్భంగా పవన్ కళ్యాణ్ అభినందించారు. జన సైనికుడు బాలాజీ ఆలోచన మెచ్చిన పవన్ కళ్యాణ్ ఆయ‌న‌ను అభినందించ‌డ‌మే కాకుండా.. ప్రోత్సాహకంగా కొంత‌ నగదు, మొబైల్ ఫోన్ బహూకరించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.