Begin typing your search above and press return to search.

మోడీని అడ్డుకునేందుకు ఒక్క‌ట‌వుతోన్న పార్టీలు..!

By:  Tupaki Desk   |   3 Dec 2021 12:35 PM GMT
మోడీని అడ్డుకునేందుకు ఒక్క‌ట‌వుతోన్న పార్టీలు..!
X
దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో మోడీని ఎలాగైనా గద్దె దింపాలని చాలా పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ప‌లు పార్టీలతో కూటమి రెడీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు లూయిజిన్హో ఫలీరో గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం మమతా బలమైన ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు కూడా ఆయన చెప్పారు. 2024 ఎన్నికల కోసం తాము వైసీపీతో కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు చెప్పారు. అలాగే తృణ‌మూల్ నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీతో కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. గోవా ఎన్నిక‌ల కోసం ప్రిపేర్ అవుతోన్న నేప‌థ్యంలో ప‌నాజీలో ఆయ‌న ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

గోవా మాజీ ముఖ్య‌మంత్రి సైతం రెండు నెల‌ల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఎంసీలో చేర‌డంతో మ‌మ‌త అక్క‌డ కూడా ప‌ట్టు సాధిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఎలాగైనా గోవాలో బీజేపీని గ‌ద్దె దింపాల‌న్న ల‌క్ష్యంతోనే మ‌మ‌త అక్క‌డ కూడా ఆప‌రేష‌న్ స్టార్ట్ చేశారు. ఏపీలో బ‌లంగా ఉన్న అధికార వైసీపీతో ఓ వైపు చ‌ర్చ‌లు జ‌రుపుతూనే అటు మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్ కూట‌మిలో ఉన్న నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కూడా మ‌మ‌త స్నేహ హ‌స్తం చాటుతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల‌తో జ‌ట్టు ఏర్పాటు చేసి బీజేపీని ఓడించ‌మ‌డ‌మే ల‌క్ష్యంగా ఆమె క‌సితో ఉన్నార‌ని లాయిజిన్హో వ్యాఖ్య‌లు చెపుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే గ‌తంలో కాంగ్రెస్‌తో ఉండి.. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కాంగ్రెస్‌కు దూరం అయిన ప్రాంతీయ పార్టీల‌నే మ‌మ‌త ప్ర‌ధానంగా టార్గెట్ చేస్తోన్న ప‌రిస్థితి. కొద్ది రోజుల క్రిత‌మే అస‌లు దేశంలో కాంగ్రెస్ అనేది ఎక్క‌డ ఉంద‌ని చెప్ప‌డం ద్వారా అస‌లు దేశంలో బీజేపీకి కాంగ్రెస్ ఎప్ప‌ట‌కీ ప్ర‌త్యామ్నాయం కాద‌న్న విష‌యాన్ని చెప్పిన‌ట్టు అయ్యింది. అయితే రేప‌టి రోజున అదే కాంగ్రెస్‌ను కూడా మ‌మ‌త క‌లుపుకున్న‌ప్ప‌ట‌కి కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని నామమాత్రం చేయ‌డం ద్వారా.. ఈ కూట‌మికి తాను లేదా.. మ‌రో రెండు, మూడు ప్రాధాన ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తోనే నాయ‌క‌త్వం ఏర్పాటు చేసేలా ఆమె ఆలోచ‌న చేస్తున్న‌ట్టుగా ఉంది.